Litchi Seed : ప్రాణం తీసిన లిచీ!
Litchi Seed : తండ్రి తెచ్చిన లిచీ పండు తింటూ 16 ఏళ్ల బాలిక కన్నుమూసిన విషాద ఘటన అస్సాంలో చోటు చేసుకుంది. జోర్హాట్ జిల్లా,కాకాజన్ సోనారి గ్రామంలో ప్రియా బోరా అనే బాలిక 10 వ తరగతి చదువుతోంది. కానిస్టేబుల్ గా పని చేస్తున్న ఆమె తండ్రి ఆదివారం డ్యూటీ ముగించుకుని ఇంటికి వచ్చేటప్పుడు లిచీ పళ్లు తీసుకు వచ్చాడు. అవి తింటుండగా పండులోని గింజ బాలిక గొంతులో ఇరుక్కుపోయింది. దాంతో ఆమె ఊపిరాడక స్పృహ తప్పిపడిపోయింది.
కుటుంబ సభ్యులు వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తీసుకు వెళ్లగా అప్పటికే బాలిక మరణించినట్లు డాక్టర్లు చెప్పారు. బాలిక చదువులో మెరిట్ స్టూడెంట్ అని… ఫైనల్ పరీక్షలకు సిధ్దమవుతుండగా ఇలా జరగటం చాలా బాధ కలిగించిందని స్ధానికులు తెలిపారు. ఆమె మరణంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.