B.tech Baba : బీటెక్ బాబా…. మహిళా భక్తులపై లైంగిక వేధింపులు
కూటి కోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు. పెద్ద పెద్ద చదువులు చదివినా ఏం సంపాదిస్తాంలే అనుకున్నాడో బీటెక్ ఇంజనీర్. బాబా అవతారం ఎత్తాడు. ప్రజలకున్న మూఢ విశ్వాసాలే పెట్టుబడగా మాయామాటలతో వాళ్లను ఆకర్షించాడు.
B.tech Baba : కూటి కోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు. పెద్ద పెద్ద చదువులు చదివినా ఏం సంపాదిస్తాంలే అనుకున్నాడో బీటెక్ ఇంజనీర్. బాబా అవతారం ఎత్తాడు. ప్రజలకున్న మూఢ విశ్వాసాలే పెట్టుబడగా మాయామాటలతో వాళ్లను ఆకర్షించాడు. ప్రజలకు సాధారణంగా వచ్చే ఆర్ధిక, అనారోగ్య సమస్యలను చిటికెలో మాయం చేస్తానన్నాడు. అమావాస్య, పౌర్ణమికి రండి మీ చింతలన్నీ తీరుస్తానంటూ ప్రజలను మోసం చేయటం ప్రారంభించాడు. ఇతడ్ని నమ్మి ఓ మహిళ మోసపోయి ఫిర్యాదు చేయటంతో బాబా బండారం బయట పడింది.
సాయి విశ్వ చైతన్య అనే వ్యక్తి హైదరాబాదులో పుట్టి పెరిగాడు. వాళ్ల పూర్వీకులు కృష్ణాజిల్లాకు చెందిన వారు. విశ్వచైతన్య హైదరాబాద్ లో బీటెక్ వరకు చదివాడు. అనంతరం విశ్వ చైతన్య పేరిట యూట్యూబ్ ఛానల్ను ప్రారంభించాడు. దానిలో షర్డీ సాయిబాబా గురించి బోధనలు చేయటం మొదలెట్టాడు. క్రమేపి దానిక సబ్ స్త్రైబర్స్ పెరిగారు. ఇంకేముంది తాను బాబా అవతారం ఎత్తాడు. ఉమ్మడి నల్గోండ జిల్లాలోని పీఏపల్లి మండలంలోని అజ్మాపురంలో పది ఎకరాల విస్తీర్ణంలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేశాడు. షిర్డీ సాయిబాబా ప్రవచనాలు చెబుతూ, పూజలు, హోమాలు చేస్తూ తాయెత్తులు కడుతూ ప్రజలనుంచి కోట్ల రూపాయలు దండుకున్నాడు.
ఇటీవల తనకు ఉన్న సమస్యలనుంచి బయట పడేస్తానని చెప్పి , డబ్బులు తీసుకుని మోసం చేశాడని ఆరోపిస్తూ ఒక బాధిత మహిళ నల్గోండ ఎస్పీకి ఫిర్యాదు చేసింది. దీంతో ఎస్పీ ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేయించారు. ఆశ్రమంలో ఉన్న సాయివిశ్వచైతన్యను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద ఉన్న బంగారం, నగదు, విలువైన డిపాజిట్ లు, బాండ్లు, ల్యాప్ టాప్ లు, ప్రవచనాలకు సంబంధించిన ఇతర పుస్తకాలను కంప్యూటర్ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మహిళా భక్తులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.