Renigunta Fire Accident: రేణిగుంట ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. చిన్నారులు సహా ముగ్గురు మృతి
తిరుపతి జిల్లా రేణిగుంటలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. క్లినిక్లో అగ్నిప్రమాదం జరగడంతో ఆస్పత్రిలో ఉన్న డాక్టర్తోపాటు ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు మహిళల్ని రెస్క్యూ టీమ్ రక్షించింది.
Renigunta Fire Accident: తిరుపతి జిల్లా, రేణిగుంటలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులతోపాటు డాక్టర్ ప్రాణాలు కోల్పోయారు. రేణిగుంట, బిస్మిల్లా నగర్లోని కార్తీక క్లినిక్లో అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో మంటలు భారీగా ఎగసిపడ్డాయి.
ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఆస్పత్రిలో ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులతోపాటు డాక్టర్ ఉన్నారు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మంటల ధాటికి ఊపిరాడకపోవడంతో ఇద్దరు చిన్నారులు మరణించారు. ఇద్దరు మహిళల్ని సహాయక బృందాలు రక్షించాయి. తర్వాత డాక్టర్ రవి శంకర్ రెడ్డిని రక్షించేందుకు సహాయక బృందాలు ప్రయత్నించాయి. కానీ, ఆయన కూడా మరణించినట్లు తాజాగా పోలీసులు వెల్లడించారు.
ఘటనలో మరణించిన చిన్నారుల మృతదేహాల్ని వెలికితీశారు. చిన్నారుల్ని సిద్ధార్థ రెడ్డి, పాప కార్తికేయగా గుర్తించారు. ఫైర్ సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.