యూపీలో మరో ఎన్ కౌంటర్ : పోలీసు కాల్పుల్లో గ్యాంగ్ స్టర్ మృతి
ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం గ్యాంగ్ స్టర్స్ మీద ఉక్కుపాదం మోపింది. గత కొద్ది రోజులుగా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ ఏరివేత కార్యక్రమం చేపట్టేందుకు స్పెషల్ టాస్క్ ఫోర్స్ రంగంలోకి దిగింది. ఎన్కౌంటర్లపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి తగ్గడంలేదు.
మాఫియాను ప్రోత్సహిస్తున్న వారి జాబితాను తయారుచేసి వెంటాడుతోంది. కరడు గట్టిన గ్యాంగ్ స్టర్ వికాస్ దుబైను ఎన్ కౌంటర్ చేసి 3 వారాలు కాక ముందే శనివారం తెల్లవారు ఝామున మరో గ్యాంగ్ స్టర్ ను మట్టుపెట్టింది. వికాస్ దుబే ఎన్ కౌంటర్ తర్వాత అక్కడి గ్యాంగ్ స్టర్స్ సురక్షిత ప్రదేశాల్లో తల దాచుకుంటున్నారు. వాళ్ళు ఎక్కడున్నా పట్టుకునేందుకు ఎస్ టీఎఫ్ పోలీసులు వేటాడుతున్నారు.
తాజాగా శనివారం తెల్లవారుఝూమున బారాబంకీ ప్రాంతంలో స్పెషల్ టాస్స్ఫోర్స్ పోలీసులు జరిపిన కాల్పుల్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ టింకూ కపాలా కన్ను మూశాడు. ఎస్టీఎఫ్ జరిపిన కాల్పుల్లో టింకూ తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు కపాలాను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడని స్థానిక ఎస్పీ అరవింద్ చతుర్వేది చెప్పారు.
టింకూ వివిధ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని, 20 ఏళ్లుగా నిషేదిత కార్యక్రమాలను పాల్పడున్నాడని పేర్కొన్నారు.టింకూ తలమీద లక్ష రూపాయల రివార్డు కూడా ఉన్నట్లు అరవింద్ చతుర్వేది తెలిపారు. టింకూ టీంలోని ఇతర క్రిమినల్స్ కోసం ప్రత్యేక బలగాలతో గాలింపు చేపడుతున్నట్లు ఎస్పీ తెలిపారు