ఏం జరుగుతోంది : శ్రావణి దొరికిన బావిలోనే.. మరో బాలిక మృతదేహం

  • Published By: veegamteam ,Published On : April 29, 2019 / 11:07 AM IST
ఏం జరుగుతోంది : శ్రావణి దొరికిన బావిలోనే.. మరో బాలిక మృతదేహం

యాద్రాది భువనగిరి జిల్లా హాజీపూర్ లో మర్డర్ మిస్టరీలు కలకలం సృష్టిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన యాదాద్రి భువనగిరి జిల్లా హాజీపూర్ టెన్త్ క్లాస్ విద్యార్థిని శ్రావణి మర్డర్  కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులకు దిమ్మతిరిగే నిజాలు తెలుస్తున్నాయి. శ్రావణి మృతదేహం దొరికిన బావిలోనే మరో బాలిక మృతదేహాన్ని పోలీసుల  గుర్తించారు. ఇది సంచలనంగా మారింది. నెల రోజుల క్రితం అదృశ్యమైన ఇంటర్ బాలిక మనీషగా పోలీసులు గుర్తించారు. మృతదేహం వెలికితీసేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.

హాజీపూర్ లో మర్డర్ మిస్టరీలు సంచలనంగా మారాయి. బాలికలను టార్గెట్ చేస్తున్నది ఎవరు? ఎందుకు చంపుతున్నారు? అనేది మిస్టరీగా మారింది. గంజాయి, మత్తుపదార్దాలకు బానిసలుగా  మారిన వ్యక్తులు ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని పోలీసుల అనుమానిస్తున్నారు. శ్రావణి హత్య కేసులో అనుమానితుడు శ్రీనివాస్ రెడ్డి పోలీసులు విచారిస్తున్నారు. శ్రావణి, మనీషలే కాదు..  హాజీపూర్ గ్రామానికి చెందిన కల్పన అనే బాలిక 2015లో అదృశ్యం అయ్యింది. కల్పన ఆచూకీ ఇంకా తెలియలేదు. శ్రావణి మర్డర్ కేసులో మిస్టరీని చేధిస్తున్న క్రమంలో విస్తుగొలిపే విషయాలు  వెలుగులోకి వస్తున్నాయి. అదే బావిలో మనీష మృతదేహం కనిపించడం కలకలం రేపింది.

హాజీపూర్‌ గ్రామానికి చెందిన పాముల నర్సింహా, నాగమణిల కుమార్తె శ్రావణి.. తొమ్మిదో తరగతి పూర్తి చేసింది. పదో తరగతి స్పెషల్‌ క్లాసుల కోసం మేడ్చల్‌ జిల్లా కీసర మండలంలోని సెరినిటి మోడల్‌ స్కూల్‌కు రోజూ ఆర్టీసీ బస్సులో వెళ్లివస్తోంది. ఇదే క్రమంలో గురువారం (ఏప్రిల్ 25,2019) ఉదయం కూడా స్కూల్‌కని వెళ్లిన శ్రావణి.. ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కంగారు పడిన  అమ్మాయి తల్లిదండ్రులు పాఠశాలలో వాకబు చేశారు. అక్కడి నుంచి వెళ్లిపోయిందని చెప్పడంతో గ్రామంలో చుట్టుపక్కల వెతికారు. అయినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. శుక్రవారం (ఏప్రిల్ 26,2019) రాత్రి ఓ బావిలో శ్రావణి మృతదేహాన్ని గుర్తించారు. శ్రావణి దారుణ హత్యకు గురైంది.