Bihar : జైల్లో ఉండే యువకుడికి కోర్టులోనే పెళ్లి .. మూడు ముడులు వేశాక కటకటాల వెనక్కి, మరి పెళ్లెందుకు చేసినట్లు..?!

జైల్లో ఉన్న ఖైదీకి అతను ప్రేమించిన అమ్మాయితో కోర్టులోనే పోలీసులు పెళ్లి చేశారు. పాపం మూడు ముళ్లు వేశాక కథ కంచికి చేరింది. కానీ కొత్త పెళ్లికొడుకు మాత్రం తిరిగి కటకటాల వెనక్కి చేరుకున్నాడు.

Bihar : జైల్లో ఉండే యువకుడికి కోర్టులోనే పెళ్లి .. మూడు ముడులు వేశాక కటకటాల వెనక్కి, మరి పెళ్లెందుకు చేసినట్లు..?!

prisoner married In court

prisoner married In court : ఓ యువతిని కిడ్నాప్ చేశాడనే ఆరోపణలో ఓ యువకుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు.  జైల్లో పెట్టారు. ఈకేసులో ఎవ్వరు ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. వారికి కోర్టులోనే పెళ్లి చేశారు. ఈ పెళ్లికి పోలీసులే పెద్దమనుషులుగా వ్యవహరించారు. కిడ్నాప్ కేసు పెట్టినవారే రాజీకి రావటంతో జైల్లో ఉండే ఈ యువకుడికి..యువతికి కోర్టు అనుమతితోనే ఇరు కుటుంబాలవారు దగ్గరుండి పోలీసుల సమక్షంలో కోర్టు ఆవరణలోనే శనివారం (మే 20,2023) పెళ్లి జరిపించారు.

బిహార్‌లోని సీతామఢీ జిల్లా బర్గానియాలో నివాసం ఉండే రాజ్ కుమార్ అనే 28 ఏళ్ల యువకుడు అర్చనా కుమారి అనే 23 ఏళ్ల యువతి ప్రేమించుకున్నారు. 2016 నుంచి వీరిద్దరు ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమను ఇరు కుటుంబాల వారు అంగీకరించలేదు. దీంతో వీరిద్దరు గత నవంబర్ లో ఇంట్లోంచి పారిపోయారు. దీంతో అర్చన కుటుంబ సభ్యులు తమ కుమార్తెను రాజా కిడ్నాప్ చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాజాను వెతికి పట్టుకుని అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం జైలుకు తరలించారు.

ఈ కేసుపై ఇటీవల స్థానిక కోర్టులో విచారణ జరిగింది. అర్చన, రాజాకి పెళ్లి జరిపిస్తామని ఇరువురి కుటుంబ సభ్యులు కోర్టుకు తెలిపారు. దీనికి న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. దీంతో శనివారం వారిద్దరికి పోలీసుల సమక్షంలో పెళ్లి జరిగింది.ఆ తరువాత రాజాను పోలీసులు జైలుకు తరలించారు. వధువుని వారి బంధువులు ఇంటికి తీసుకెళ్లిపోయారు. ఈ కేసు విచారణను కోర్టు జూన్‌ 19కి వాయిదా పడింది.మరి రాజాను విడుదల చేస్తారో లేదో వేచి చూడాలి..