అబార్షన్ గడువు 24వారాలకు పెంపు…కేంద్రమంత్రివర్గ ఆమోదం

  • Published By: venkaiahnaidu ,Published On : January 29, 2020 / 10:41 AM IST
అబార్షన్ గడువు 24వారాలకు పెంపు…కేంద్రమంత్రివర్గ ఆమోదం

గర్భిణీలు ఇకపై 24వారాల్లో ఎప్పుడైనా అబార్షన్ చేయించుకునేలా చట్టం మార్పులు చేసేందుకు రెడీ అవుతోంది కేంద్రప్రభుత్వం. ఇప్పటివరకు అబార్షన్ కు ఉన్న 20వారాల లిమిట్ ను 24వారాలకు పొడిగించేందుకు ఇవాళ కేంద్రమంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ మేరకు మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగెన్సీ చట్టంలో సవరణలకు సంబంధించిన ప్రతిపాదనలపై కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. కేంద్ర కేబినెట్ ఆమోదం పొందిన ఈ సవరణ ప్రతిపాదనలు త్వరలో బిల్లు రూపంలో పార్లమెంట్ ముందుకు రానున్నాయి.

ఇవాళ(జనవరి-29,2020)ఉదయం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం అనంతరం కేంద్రమంత్రి ప్రకాష్ జావదేకర్ మీడియాతో మాట్లాడుతూ…అబార్షన్ లిమిట్ పొడిగింపును ప్రగతిశీల సంస్కరణగా అభివర్ణించారు. ఇది మహిళలకు వారి శరీరాలపై పునరుత్పత్తి హక్కులను ఇస్తుందని ఆయన అన్నారు. పిండం ప్రాణాన్ని కాపాడటంలో పునరుత్పత్తి స్వయంప్రతిపత్తి హక్కును అధిగమించలేదని, 20 వారాల పరిమితిని గుడ్డిగా పొడిగించలేమని కేంద్రం సుప్రీంకోర్టుకు చెప్పిన నాలుగు నెలల తరువాత కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. 

ఈ నిర్ణయం మహిళలకు తమ శరీరాలపై పునరుత్పత్తి హక్కులు కల్పిస్తుందని జావదేకర్ తెలిపారు. ఇది చాలా ముఖ్యమని,ఎందుకంటే మైనర్లు,అత్యాచార బాధితులు,కొన్ని విపత్కర పరిస్థితుల్లో గర్భం దాల్చినవాళ్లు  మొదటి ఐదు నెలల్లో  తాము గర్భం దాల్చామని తెలుసోలేక ఆ తర్వాత అబార్షన్ కోసం కోర్టు మెట్లు ఎక్కాల్సివచ్చిన కేసులు చాలా ఉన్నాయని,ఓ వర్గం మహిళలు,డాక్టర్ల నుంచి అబార్షన్ లిమిట్ ను పొడిగించాలన్న డిమాండ్ ఉందని జావదేకర్ తెలిపారు.

గతేడాది సెప్టెంబర్ లో…అబార్షన్ కు 20వారాల గడువు ఫిక్స్ చేసిన మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్-1971 సెక్షన్ 3(2) రాజ్యాంగ ప్రామాణికతను సవాల్ చేస్తూ,లిమిట్ ను 26వారాలకు పొడించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై కేంద్రం స్పందిస్తూ…పౌరుల సంరక్షకుడిగా,గర్భంలో ఉన్న పిండం  సాధ్యమయ్యే దశకు చేరుకున్న తర్వాత ఆ ప్రాణాన్ని కాపాడటానికి నైతికంగా మరియు విధి కలిగి ఉందని తెలిపింది. పుట్టని శిశువు తన తండ్రి,లేదా తల్లి తలపెట్టే హానినుంచి తనను తాను కాపాడుకోలేదని తెలిపింది. చాలా కేసుల్లో పదే పదే… ప్రెగ్నెన్సీని తొలిగించుకోవాలనుకున్న మహిళల కన్నా…మానసిక వేదన,గాయాలతో గర్భం దాల్చాలనుకున్న మహిళల్లో 20వ వారం తర్వాత తీవ్రమైన అసాధారణతలు గుర్తించబడినట్లు అధ్యయనాలు చెప్పాయని కూడా ప్రభుత్వం తెలిపింది.

1971 నుంచీ మెడికల్ టెర్మినాలజీ ఆఫ్ ప్రెగెన్సీ చట్టం ఎలాంటి సవరణలకూ నోచుకోలేదని ఇవాళ ప్రకాష్ జావదేకర్ అన్నారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకు అనుగుణంగా చట్టాన్ని సవరించాల్సి వచ్చిందని ప్రకాశ్ జవదేకర్ చెప్పారు. ఈ అంశంపై అధ్యయనం చేయడానికి కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షతన ఓ మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ఏర్పాటు చేశామని అన్నారు. ఈ ఉపసంఘం ఇచ్చిన సిఫారసులపై కూలంకషంగా చర్చించామని, చట్టంలో సవరణలు చేయడానికి, అందులో కొత్తగా తీసుకుని రావాల్సిన మార్పులు, చేర్పులపై మంత్రుల నుంచి అభిప్రాయాలను సేకరించామని చెప్పారు. ఆ తరువాతే.. ప్రెగ్నెన్సీ చట్టంలో సవరణల ప్రతిపాదనలను ఆమోదించామని చెప్పారు.