ఒంటె పాలు లీటర్ రూ.600, కారణం ఏంటో తెలిస్తే మీరూ కొంటారేమో
ఆవు, గేదె, మేక పాలతో వ్యాపారం చేయడం కామన్. కానీ ఒంటె పాలతో వ్యాపారం చేయడం చూశారా. కనీసం విన్నారా. అదీ లీటర్ ఒంటె పాలు రూ.600 అంటే నమ్ముతారా? ఒంటె పాలతో వ్యాపారం ఏంటి? లీటర్ 600 రూపాయలకు అమ్మడం ఏంటి? అని షాక్ అయ్యారా. కానీ ఇది నిజం.
సాధారణంగా ప్రతి రోజూ మనం కొనే గేదె/ఆవు పాలు రూ.80 కో, రూ.100కో అమ్ముతారు. కాని తక్కువగా అమ్మే ఒంటె పాలకు మాత్రం ఫుల్ డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో కొందరు ఒంటెల వ్యాపారులు ఒంటె పాల వ్యాపారం చేయడానికి ఏకంగా రాజస్థాన్ నుంచి హైదరాబాద్ నగరానికి వలస వచ్చారు. ఒంటె పాలను లీటర్ రూ.600కు విక్రయిస్తున్నారు. ఒంటె పాలు అంత ధర పలకడానికి కారణం లేకపోలేదు. ఒంటె పాలలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయట.
ఒంటె పాలలో ఔషధ గుణాలు:
* సాధారణ పాలతో పోలిస్తే ఒంటె పాలలో ఔషధ గుణాలు ఎక్కువే
* ఈ పాలలో ఒమేగా-3ఫాటీ ఆసిడ్స్, మోనో అన్శాచ్యురేటెడ్ ఫ్యాటీ ఆసిడ్స్ ఎక్కువ.
* సంతృప్త కొవ్వు ఆమ్లాలు, కొలెస్ట్రాల్, చక్కెర స్థాయిలు తక్కువగా ఉంటాయి.
* విటమిన్ సి, బీ2, ఏ, ఈ విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.
* యాంటీ యాక్సిడెంట్లు, యాంటీ ఏజింగ్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ గుణాలున్నాయి.
* వాటితో పాటు మెగ్నీషియం, జింక్, ఐరన్ వంటి ఖనిజ లవణాలు ఇందులో కావల్సిన స్థాయిలో ఉంటాయి.
* అంతేకాక ఈ పాలు దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులకు ఆహారంలో ఎక్కువగా ఇస్తారట.
* టీబీ, జాండిస్, రక్తహీనత, ఆటిజం, మధుమేహం వంటి వ్యాధుల బాధితులకు దీన్ని తమ ఆహారంలో భాగంగా చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
* బుద్ది మాంద్యంతో బాధపడుతున్న చిన్నారులకు ఒంటె పాలు తాగిస్తే బుద్ధి వికసిస్తుందన్నది నిపుణుల మాట.
* ఆవు, గేదె పాలతో సమస్య తలెత్తే పిల్లలకు ఒంటె పాలు ఇస్తే అలెర్జీ తొలగిపోతుందట.
* ఒంటె పాలు రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది.
* 1 మరియు టైప్ 2 డయాబెటిస్ రెండింటిలోనూ ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరుస్తాయి.
* రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలను అందించే ప్రోటీన్లను కలిగి ఉంటుంది.
ఒంటె పాలలో ఇన్ని ఔషధ గుణాలు ఉన్నందునే అంత రేటు పలుకుతుందని రాజస్థాన్ వాసులు చెబుతున్నారు. అయితే ఎవరికి వారు సొంత నిర్ణయం తీసుకోకుండా డాక్టర్ సలహా మేరకే ఏదైనా వాడవలసి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. లాక్ డౌన్ కారణంగా పని లేక వలస కార్మికులు స్వస్థలాలకు తరలిపోతుంటే రాజస్థాన్కి చెందిన కొందరు మాత్రం ఒంటెలను తీసుకుని నగరానికి వలస వచ్చారు. ఒంటెలే వారి జీవనాధారం. ఒంటె పాలు లీటర్ రూ.600కు విక్రయిస్తూ తద్వారా వచ్చే ఆదాయంతో జీవనం సాగిస్తున్నారు.
Read: తిరుమల శ్రీవారి లడ్డూలు మే 31 నుంచి హైదరాబాద్ లో అమ్మకం