మిధాని భరోసా : సశస్త్ర సీమబల్కు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్
సశస్త్ర సీమబల్కు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు అందాయి. ఈ వాహనాలను మిధాని రూపొందించింది. మార్చి 30వ తేదీ శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో మిశ్రధాతు నిగమ్ లిమిటడ్ సీఎండీ డా.దినేశ్ కుమార్ లిఖీ 15 బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను సశస్త్ర సీమబల్కు అందచేశారు. ఈ సందర్భంగా లిఖీ మాట్లాడుతూ..బుల్లెట్ వాహనాలను మిధాని సవాలుగా తీసుకుని తయారు చేసిందని, అనుకున్న సమయంలోనే వీటిని తయారు చేయడం జరిగిందన్నారు. దేశ సరిహద్దులో రక్షణ కోసం భారత సైన్యం, భారత వైమానిక దళం ఉపయోగిస్తుందన్నారు. లైట్ వెయిట్ సాయుధ పదార్థంతో తయారు చేసిన ఈ వెహికల్స్ ఎంతో అనువుగా ఉంటాయని తెలిపారు.
CAPF అవసరాలకు అనుగుణంగా వీటిని రూపొందించినట్లు సీఏపీఎఫ్ డిప్యూటి కమాండెంట్ జె.కె.శర్మ తెలిపారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనాల తయారీకి కృషి చేసిన మిధాని ఉద్యోగులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో మిధాని అధికారులు, ఉద్యోగులు, ఇతరులు పాల్గొన్నారు.