స్వచ్ఛ హైదరాబాద్ కోసం : GHMC ఫైన్ కొరడా
హైదరాబాద్ : హైదరాబాద్ : పరిశుభ్రమైన హైదరాబాద్ కోసం GHMC అధికారులు కఠినమైన నిర్ణయాలను తీసుకుంటున్నారు. దీంట్లో భాగంగా..రోడ్లమీద చెత్త , డెబ్రిస్ వంటివి వేసినా.. బహిరంగ మూత్ర విసర్జన చేసినా జరిమానాలు విధిస్తోన్న జీహెచ్ఎంసీ రోడ్లను ఇష్టానుసారం తవ్వి వ్యర్థాలను అలాగే వదిలేస్తున్న ప్రభుత్వ విభాగాలు, ప్రైవేటు ఏజెన్సీలకు సైతం పెనాల్టీలు విధించనుంది. రోడ్లపై భవన నిర్మాణ వ్యర్థాలు, చెత్త వేసే వారు..నిబంధనలకు మించిన ప్లాస్టిక్ వ్యర్థాలు ( 50 మైక్రాన్ల కన్నా తక్కువ ప్లాస్టిక్) కవర్లను వినియోగించేవారికి..పరిశుభ్రత పాటించకుండా..ఇష్టమొచ్చినట్లుగా వ్యవహరించేవారికి భారీఎత్తునజరిమానాలు విధించాలని GHMC కమిషనర్ ఎం.దానకిశోర్ ఆదేశించారు.
నగరంలో పరిశుభ్రత కోసం ఎన్ని నిధులు ఖర్చు చేస్తున్నా..పూర్తిస్థాయిలో ఫలితాలు రావటంలేదని..దీంతో పెనాల్టీలు వేస్తేనే గానీ మార్పు రాదనే నిర్ణయానికి వచ్చారు అధికారులు. బుధవారం (ఫిబ్రవరి 5)న ‘స్వచ్ఛ సర్వేక్షణ్–2019’ పై అడిషనల్, జోనల్ , డిప్యూటీ కమిషనర్లు, తదితరులతో సమీక్ష సమావేశంలో పరిశుభ్రత విషయంలో నిబంధనలకు అతిక్రమించేవారిపై కనీసం 500 మందికి తగ్గకుండా భారీ పెనాల్టీలు విధించాలని ఆదేశించారు.
నీటి వృథాపై కొరడా : ఇళ్లు..వాహనాలు కడిగే క్రమంలో నీటి వృథా భారీగా జరుగుతోందనీ..ఆ నీటిని రోడ్లపైకి నిర్లక్ష్యంగా వదిలివేటయంపై కూడా కొరడా ఝుళిపించనున్నారు అధికారులు. నగరానికి ప్రతిరోజు 400 మిలియన్ గ్యాలన్ల నీరు సరఫరా అవుతుండగా..దాంట్లో 10 శాతం (40 ఎంజీడీల) నీరు ఇలా వృథా అవుతోందని..దీంతో రూ. 250కోట్ల విలువైన నీరు వృథా అవుతోందని..రోడ్లు త్వరగా పాడైపోవటానికి కారణాలు కూడా అవేనని కమిషనర్ దానకిశోర్ తెలిపారు. ఇకపై ఇటువంటివి సహించబోమని స్పష్టంచేశారు.
మురికివాడల సుందరీకరణ : మురికివాడల్లో ప్రధాన మార్గాల్లోని గోడలపై అందమైన పెయింటింగ్లు..చెత్త నిల్వ తొలగింపులు..నగరంలోని గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్లను సుందరీకరణ..ప్రతి ట్రాన్స్ఫర్ స్టేషన్కు గ్రీన్ టార్పాలిన్ ఫెన్సింగ్..ట్రాన్స్ఫర్ స్టేషన్లో ఔషధ మొక్కలు, తీగజాతి మొక్కలను నాటడంతో పాటు టాయ్లెట్లను ఏర్పాటు చేసి సక్రమంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని కమిషనర్ ఆదేశించారు.
రూల్స్ పాటించని హోటల్స్ సీజ్ : ఆహార..హోటల్ వ్యర్థాలను నాలాల్లో వేసుయటం..పొంగిపోతున్న డ్రైనేజీలతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయనీ.. అటువంటి హోటళ్లను గుర్తించి సీజ్ చేయాలని కమిషనర్ దాన కిషోర్ ఆదేశించారు. ముఖ్యంగా.. పూల బొకేలకు ప్లాస్టిక్ కవర్లను వినియోగించటం పూర్తిగా నిషేధించాలని ఆదేశించారు. జనవరి 4వ తేదీ నుండి 31వ తేదీలోగా స్వచ్ఛ సర్వేక్షణ్ బృందాలు నగరంలో పర్యటించే అవకాశం ఉన్నందున వారు అడిగే ఏడు ప్రశ్నలపై పెద్ద ఎత్తున నగర ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కమిషనర్ దాన కిషోర్ ఆదేశించారు.