హైదరాబాద్ లో ఇస్రో శాస్త్రవేత్త హత్య

  • Published By: venkaiahnaidu ,Published On : October 2, 2019 / 05:29 AM IST
హైదరాబాద్ లో ఇస్రో శాస్త్రవేత్త హత్య

ఓ ఇస్రో శాస్త్రవేత్త తన ఇంట్లో హత్యకు గురయ్యాడు. హైదరాబాద్ లోని అమీర్ పేట్ లో ఈ దారుణం జరిగింది. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

ఇస్రోకి చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్(NRSC)లో కేరళకు చెందిన  ఎస్ సురేష్(56)సైంటిస్టుగా పనిచేస్తున్నారు. హైదరాబాద్ లోని అమీర్ పేటలోని అన్నపూర్ణ అపార్ట్మెంట్ లోని ఓ ప్లాట్ లో ఒక్కడే ఉంటున్నాడు. తన కుమార్తె ఢిల్లీలో నివసిస్తుండగా, కుమారుడు యుఎస్‌లో స్థిరపడటం, భార్య ఇందిర చెన్నైలో బ్యాంకు ఉద్యోగం చేస్తుండటంతో ఫ్లాట్ లో సురేష్ ఒక్కడే ఉంటున్నాడు. 

అయితే మంగళవారం(అక్టోబర్-1,2019)సురేష్ ఆఫీస్ కి రిపోర్ట్ చేయకపోవడంతో అతడి మొబైల్ నెంబర్ కి సహోద్యోగులు కాల్ చేశారు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో వారు చెన్నైలో ఉంటున్న సురేష్ భార్య ఇందిరకు ఫోన్ చేశారు. వెంటనే ఇందిర మరికొందరు కుటుంబసభ్యులతో కలిసి హైదరాబాద్ కు చేరుకుని పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు వెళ్లి ఫ్లాట్ డోర్ పగులగొట్టి చూడగా సురేష్ శవమై పడి ఉన్నాడు. సురేష్ ది హత్యగా పోలీసులు గుర్తించారు. తలపై బలమైన వస్తువుతో కొట్టడంతోనే సురేష్ చనిపోయినట్లు గుర్తించారు. బాడీని పోస్ట్ మార్టంకు తరలించారు.

పోలీస్ క్లూస్ బృందం ఘటనా స్థలం నుండి ఆధారాలు సేకరించింది. ఘటనా స్థలాన్ని సీనియర్ పోలీసు అధికారులు సందర్శించారు. కేసు దర్యాప్తు కోసం అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లోని సిసిటివి ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు వారు తెలిపారు.