కాస్కో బాబు!! : కేసీఆర్ బహుముఖ వ్యూహాలు

హైదరాబాద్ : మీరు తెలంగాణకు వస్తే.. మేం ఆంధ్రాకు వస్తాం. మీరు గిప్ట్ ఇస్తే.. మేం రిటర్న్ గిఫ్ట్ ఇస్తం. ఛలో.. చూసుకుందాం. రాజకీయంగానే తేల్చుకుందాం. ఇప్పుడు ఈ మాటలు.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కాకపుట్టిస్తున్నాయి. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామన్న కేసీఆర్.. ఆ దిశగా స్కెచ్ వేస్తున్నట్టు టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే జగన్తో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అయ్యారు. ఫిబ్రవరిలో సీఎం కేసీఆర్ అమరావతిలో పర్యటించే అవకాశముంది.
ఏపీ రాజకీయాల్లో కచ్చితంగా వేలు పెడతామన్న కేసీఆర్.. బీసీ నినాదంతో టీడీపీకి చెక్ పెట్టాలని భావిస్తున్నారు. ఏపీలో సామాజిక సమీకరణలు.. నియోజకవర్గాల పరిస్థితులపై సీఎం కేసీఆర్ ఆరా తీశారు. ఏపీలో సుమారు 100 నియోజకవర్గాల్లో బీసీల ప్రభావం ఉంటుందని నిర్దారణకు వచ్చారు. ఇప్పటికే ఒకసారి ఆంధ్రాలో పర్యటించి పొలిటికల్ హీట్ను రగిలించిన తలసాని.. త్వరలో రాయలసీమలో పర్యటించనున్నారు. రాయలసీమలో రాజకీయ పరిస్థితిపై ఆరా తీయనున్నారు. సీఎం కేసీఆర్తో జతకట్టిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్.. ఏపీలోని ముస్లిం ఓటు బ్యాంక్ను ప్రభావితం చేస్తున్నారు. ఏపీ ముస్లింలంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలుపునకు కృషి చేయాల్సిందిగా ఓవైసీ పిలుపునిచ్చారు.
అటు బీసీల ఓట్లు.. ఇటు ముస్లింల ఓట్లు.. జగన్ సామాజిక వర్గం ఓట్లు.. వైఎస్ఆర్ కాంగ్రెస్కు కలిసివచ్చే అవకాశముందని ఆ పార్టీల నేతలు భావిస్తున్నారు. చంద్రబాబుకు రిటర్న్గిఫ్ట్ ఇచ్చేందుకు కేసీఆర్ బహుముఖ వ్యూహాలను అనుసరిస్తున్నారని టీఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి.