ఆల్ ది బెస్ట్ : నేటి నుండి ఇంటర్ పరీక్షలు

  • Published By: vamsi ,Published On : February 27, 2019 / 01:25 AM IST
ఆల్ ది బెస్ట్ : నేటి నుండి ఇంటర్ పరీక్షలు

తెలంగాణ రాష్ట్రంలో నేటి(ఫిబ్రవరి 27వ తేదీ) నుంచి ఇంటర్మీడియట్ పరిక్షలు మొదలు కానున్నాయి. బుధవారం నుంచి వచ్చే నెల(మార్చి) 16వ తేదీ వరకు పరిక్షలు జరగనుండగా పరిక్షలకు సంబంధించి అన్నీ ఏర్పాట్లను బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 9,42,719 మంది విద్యార్థులు ఈ ఏడాది పరిక్షలకు హాజరు కానున్నారు. ఇందులో మొదటి సంవత్సరం పరిక్షలకు 4,52,550 మంది, రెండవ సంవత్సర పరిక్షలకు 4,90,169 మంది విద్యార్ధులు అప్లై చేసుకున్నారు.

పరీక్షల నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,277 పరీక్ష కేంద్రాలను ఇంటర్‌ బోర్డు సిద్ధం చేసింది. వీటిలో 1,277 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లు, 1,277 మంది డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్లు, 24,508 మంది ఇన్విజిలేటర్లను నియమించింది. 1,277 పరీక్ష కేంద్రాల్లో 40 సెల్ఫ్‌ సెంటర్లు ఉన్నాయి. వీటిలో 32 సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని బోర్డు నిర్ణయించింది. పరీక్షలు పూర్తయ్యే వరకు సిట్టింగ్‌ స్క్వాడ్ లు పరిక్షా కేంద్రాల వద్దనే ఉంటాయి. అలాగే ప్రతి పరీక్ష కేంద్రంలో ప్రశ్నపత్రాల బండిల్స్‌ విప్పే చీఫ్‌ సూపరింటెండెంట్‌ గదిలో సీసీ కెమెరాల నిఘా ఉంటుంది. అలాగే ఫ్లైయింగ్ స్క్వాడ్ లు కూడా పరిక్షా కేంద్రాలకు వస్తాయి.

ఎప్పటిలాగే ఈసారి కూడా నిమిషం నిబంధన అమలు కానుంది. విద్యార్థులు ఉదయం 8 గంటల నుంచే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. ఉదయం 8:45 గంటలకల్లా పరీక్ష హాలరులోకి చేరుకోవాలి. 9 గంటలకు పరీక్ష ప్రారంభం అవుతుంది, 9 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించరు. హాల్‌టికెట్లను ఇంటర్‌ బోర్డు ఇప్పటికే కాలేజీలకు పంపించింది. ఫీజులు చెల్లించలేదనే కారణంతో కాలేజీలు విద్యార్థులకు హాల్‌టికెట్లు ఇవ్వడంలేదన్న ఫిర్యాదుల నేఫథ్యంలో వెబ్‌సైట్లోనూ హాల్‌టికెట్లను బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఉంచింది. bie.telangana.gov.in  వెబ్‌సైట్‌ ద్వారా హాల్ టిక్కెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఆ హాల్ టిక్కెట్ పై ఎటువంటి సంతకం అక్కర్లేదు. విద్యార్థులు వీలైనంత ముందుగా పరీక్ష కేంద్రానికి చేరుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

విద్యార్ధులు పాటించవలసిన నియమాలు:

  • హాల్‌టికెట్‌ లేకుండా పరీక్షకు అనుమతి అభించదు. హాల్‌టికెట్లలో పొరపాట్లు ఉంటే మాత్రం సంబంధిత ప్రిన్సిపాల్‌ ద్వారా జిల్లా ఇంటర్‌ విద్యా అధికారిని సంప్రదించవచ్చు.  
  • జవాబు పత్రంలో 24 పేజీలు ఉన్నాయో లేదో ముందే చూసుకోవాలి. బార్‌కోడ్, సబ్జెక్టు వివరాలను సరిచూసుకోండి. 
  • మొబైల్స్, పేజర్లు, కాలిక్యులేటర్ల వంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలు, పేపర్లు పరీక్ష హాలుకు తీసుకుని వెళ్లకూడదు. వాటిని ఎవరికీ తెలియకుండా తీసుకెళ్తే మాల్‌ ప్రాక్టీస్‌ కేసు కింద బుక్‌ చేస్తారు.  
  • కాపీయింగ్, మాల్‌ప్రాక్టీస్, ఒకరికి బదులు ఒకరు పరీక్ష రాస్తే క్రిమినల్‌ కేసు నమోదు చేస్తారు.  
  • పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమల్లో ఉంటుంది. జిరాక్స్‌ కేంద్రాలు మూసివేస్తారు.  
  • పరీక్షలకు సంబంధించి ఏమైనా సమస్యలు తలెత్తితే హైదరాబాద్‌లోని హెల్ప్‌లైన్‌ కేంద్రానికి (040–24601010, 040–24732369) ఫోన్‌ చేయవచ్చు.