రూ.3కోట్లు లాటరీ పేరుతో మోసం: పొలం అమ్మి డబ్బులు కట్టిన తెలంగాణ యువకుడు

  • Published By: vamsi ,Published On : October 11, 2019 / 01:54 AM IST
రూ.3కోట్లు లాటరీ పేరుతో మోసం: పొలం అమ్మి డబ్బులు కట్టిన తెలంగాణ యువకుడు

చదువులేనివాడు సైబర్ నేరగాళ్ల వలలో పడి మోసపోయారంటే పాపంలే అనుకోవచ్చు. కానీ ఉన్నత చదువులు చదువుకుని ఎంతోమంది యువత సైబర్ నేరగాళ్లకు చిక్కి బుక్కైపోతున్నారు. అవును ఇదే నిజం. లేటెస్ట్ గా లాటరీ పేరుతో ఓ యువకుడిని మోసం చేశారు సైబర్ నేరగాళ్లు. లాటరీలో రూ. 3కోట్లు వచ్చాయని నమ్మించి వల విసిరిన సైబర్ నేరస్థుడు మాటలు నమ్మి తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా కమ్మరపల్లి మండలానికి చెందిన గంగిరెడ్డి(19) అనే వ్యక్తి అడ్డంగా బుక్కయ్యాడు. చివరకు పొలంపుట్ర అమ్మి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాడు.

వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ నగరానికి వచ్చిన గంగిరెడ్డి కాచిగూడలోని ఓ హాస్టల్ లో ఉంటూ హోటల్ మేనేజ్ మెంట్ కోర్సు చేస్తున్నాడు. ఈ ఏడాది ఏప్రిల్ 16వ తేదీన గంగిరెడ్డికి ఓ ఈ-మెయిల్ వచ్చింది. కోకాకోలా కంపెనీ పేరుతో వచ్చిన ఈ-మెయిల్ లో..  సదరు కంపెనీ లాటరీలో రూ.3 కోట్ల బహుమతి వచ్చినట్లుగా ప్రకటించింది. మీ వివరాలు పంపితే రూ.3 కోట్ల డబ్బు పంపుతామంటూ ఆ ఈ-మెయిల్ లో వెల్లడించింది. దానిని నమ్మిన గంగిరెడ్డి పేరు, చిరునామా, ఫోన్ నంబరు సహా అన్ని వివరాలను గుడ్డిగా నమ్మి పంపేశాడు. రెండు రోజుల తర్వాత డాక్టర్ నికోలస్ హోగ్లర్ పేరుతో ఓ వ్యక్తి గంగిరెడ్డికి ఫోన్ చేసి మీకు లాటరీ వచ్చినందుకు అభినందనలు అని తెలిపి లాటరీ డబ్బు రావాలంటే రూ.23వేలు వెయ్యాలంటూ కోరారు.

రూ.23వేలే కదా? వస్తే రూ.3కోట్లు అని నమ్మిన గంగిరెడ్డి అతను అడిగిన మొత్తాన్ని అకౌంట్లో వేశాడు. సదరు మొత్తం జమ అయిన తర్వాత నగదు జమైనట్టు కోకాకోలా పేరుతో మళ్లీ మెయిల్ పంపాడు నేరగాడు. అంతే జీఎస్టీ, ఆదాయ పన్ను(ఐటీ)  అంటూ మరింత అమౌంట్ అడిగాడు. రూ.5 లక్షలు కావాలని సైబర్ నేరగాడు అడగగా.. తన వద్ద అంత సొమ్ము లేకపోవడంతో స్వగ్రామానికి వెళ్లిన గంగిరెడ్డి తండ్రికి విషయం చెప్పి 15-20 రోజుల్లో రూ.3 కోట్లు చెక్కు వస్తుందని, రూ.5 లక్షలు ఇవ్వమని కోరాడు. అంత సొమ్ము లేదని చెప్పి చివరకు రూ.2 లక్షలు ఇవ్వగా ఆ మొత్తాన్ని మళ్లీ అకౌంట్ లో వేశాడు.

తర్వాత మరో రూ.10 లక్షలు.. ఇలా మొత్తం రూ.43.22 లక్షలు సైబర్ నేరగాడికి ఇచ్చాడు గంగిరెడ్డి ఐదు నెలల్లో. ఇందుకోసం గంగిరెడ్డి తండ్రి చేత బలవంతంగా పొలాన్ని కూడా అమ్మించాడు. రూ.3 కోట్లతో 30ఎకరాలు కొనొచ్చంటూ కొడుకు ఒత్తిడి చేయడంతో చివరకు పొలం అమ్మి కొడుక్కి డబ్బులు ఇచ్చాడు. ఆ డబ్బు అంతా కొడుకు సైబర్ నేరగాడికి వేశాడు.

అయితే ఎంతకీ చెక్కు రాకపోవడంతో అనుమానించిన రైతు కొడుకును నిలదీయగా.. ఫోన్ లో నేరగాడిని సంప్రదించేందుకు ట్రై చేశాడు. ఆ నంబరు స్విచ్ ఆఫ్ రావడంతో మోసపోయినట్టు గుర్తించి పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సైబర్ క్రైమ్ పోలీసులకు కేసు అప్పగించగా.. వాళ్లు విచారణ చేపట్టారు.