కాంగ్రెస్ నేతలకు ఉత్తమ్ అదిరిపోయే ఆఫర్

  • Published By: naveen ,Published On : September 17, 2020 / 04:06 PM IST
కాంగ్రెస్ నేతలకు ఉత్తమ్ అదిరిపోయే ఆఫర్

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తమ నేతలకు ఒక అదిరిపోయే ఆఫర్‌ను ప్రకటించింది. త్వరలో జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. తమకు అందిన దరఖాస్తుల్లో గెలవగలిగిన వారు ఎవరనేది పార్టీలో చర్చించి వారికే టిక్కెట్ కేటాయిస్తామని స్పష్టం చేశారు. ఆసక్తి ఉన్న వారు పార్టీ రాష్ట్ర కార్యాలయం గాంధీ భవన్‌లో ఉపాధ్యక్షుడు కుమార్ రావుకు సెప్టెంబర్ 19లోగా దరఖాస్తులు అందజేయాలని సూచించారు. వచ్చిన దరఖాస్తులను స్క్రూటినీ చేసి.. ఏఐసీసీకి ఈనెల 25కు పంపిస్తామని ప్రకటించారు. అంతే ఇప్పుడు ఆశావహులు గాంధీభవన్‌ ముందు అప్లికేషన్లతో క్యూ కట్టారు.

ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీ చేసేందుకు తహతహ:
అసెంబ్లీ ఎన్నికలకు చాలా సమయం ఉన్నందున ఈలోగా ఎమ్మెల్సీ బరిలో నిలిచి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని పలువరు కాంగ్రెస్‌ నేతలు భావిస్తున్నారట. త్వరలో రానున్న రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీ చేసేందుకు నేతలు తహతహలాడిపోతున్నారు. తమ బలాలను కాగితాల మీద, బలప్రదర్శనను నేతల ముందు చూపిస్తున్నారట. ఇలా మొత్తం మీద గడువుకు ఐదు రోజుల సమయం ముందే 20కి పైగా దరఖాస్తులు వచ్చాయని చెబుతున్నారు.


https://10tv.in/high-tension-in-krishna-district/
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ జిల్లాల స్థానానికి చల్లా వంశీ చంద్‌రెడ్డి, సంపత్ కుమార్, కూన శ్రీశైలంగౌడ్, జి.చిన్నారెడ్డి, ఇందిరా శోభన్ వంటి వారు దరఖాస్తు చేసుకున్నారట. వరంగల్-ఖమ్మం-నల్లగొండ సీటు కోసం రాములు నాయక్, మానవతా రాయ్, నాయిని రాజేందర్ రెడ్డి, కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, బలరాం నాయక్ లాంటి నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టేశారు.

మొత్తం మీద కాంగ్రెస్ నేతల రాకపోకలతో గాంధీ భవన్ ఒక్కసారిగా కళకళలాడిపోతోందని నేతలు అంటున్నారు. అంతా బాగానే ఉంది కానీ.. టికెట్‌ రాని నేతలు ఇప్పుడు ఉన్నట్టుగానే ఉంటారు? ఓవర్‌గా రియాక్ట్‌ అవుతారా అనే డిస్కషన్‌ పార్టీలో మొదలైందట. గెలుపు గుర్రాలను కాంగ్రెస్‌ సక్రమంగానే ఎంచుకుంటుందా? లేకుంటే ఎప్పట్లాగే గ్రూపులకు ప్రాధాన్యం ఇస్తుందా అన్నది వేచి చూడాల్సిందే.