బీహార్ లో జిన్ పింగ్ పై కేసు నమోదు..సాక్షులుగా మోడీ, ట్రంప్
కరోనా వైరస్ వ్యాప్తికి చైనాయే ప్రధాన కారణమంటూ ఆరోపిస్తూ బీహార్లోని కోర్టులో పిటిషన్ . దాఖలు అయింది. పశ్చిమ చంపారన్ జిల్లాలోని బెట్టియాలోని చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో స్థానిక న్యాయవాది మురాద్అలీ పిటిషన్ దాఖలు చేశారు. చైనాలోని వూహన్ నగరం నుంచి చైనా అధ్యక్షుడు జిన్పింగ్తోపాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసన్లు ప్రపంచానికి వైరస్ను వ్యాప్తి చేశారని తన పిటిషన్లో పేర్కొన్నారు. కేసు విచారణకు స్వీకరించిన కోర్టు తదుపరి విచారణను జూన్ 16వ తేదీకి వాయిదా వేసింది. వైరస్ వ్యాప్తికి ప్రధాన సాక్షులుగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, భారత్ ప్రధాని నరేంద్ర మోడీలను పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా 2019 డిసెంబర్లో చైనాలోని వూహాన్ నగరం నుంచి ప్రాణాంతక కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు వ్యాపించడానికి చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కారణమని, వైరస్ వ్యాప్తిని దాచిపెట్టినందుకు డబ్ల్యూహెచ్వో చీఫ్ కూడా నిందితుడే అని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. వీరిద్దరి కుట్ర కారణంగానే ప్రస్తుతం ప్రపంచ దేశాలు వైరస్ బారినపడి అన్నిరకాలుగా నష్టపోయాయని వాపోయారు. లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని విచారం వ్యక్తం చేశారు. జిన్పింగ్తోపాటు టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసన్పై ఐపీసీలోని 269, 270, 271, 302, 307, 500, 504, 120 బీ సెక్షన్ల కింద చర్యలు తీసుకోవాలని కోరారు.