భారత్‍పై చైనా భారీ కుట్ర, కశ్మీర్‌లో మారణహోమానికి పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలతో చర్చలు

భారత్‍పై చైనా భారీ కుట్ర, కశ్మీర్‌లో మారణహోమానికి పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలతో చర్చలు

భారత్ పై చైనా భారీ కుట్ర పన్నిందా? భారత్‌ను దొంగ దెబ్బ తీయాలని చూస్తోంది? ఓవైపు సైనికులు, మరోవైపు ఉగ్రవాదులతో దాడులకు పథకం పన్నిందా? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. తూర్పున చైనా, పశ్చిమాన పాకిస్తాన్‌.. భారత్‌ను దొంగదెబ్బ కొట్టేందుకు కలిసికట్టుగా కుతంత్రం పన్నుతున్నాయి. లఢక్‌ తూర్పు భాగంలో వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వెంట చైనా 20వేల మంది సైనికులను మోహరించింది. చైనాకు మద్దతుగా అంతే మొత్తంలో లఢక్‌ పశ్చిమ భాగంలోని గిల్గిత్‌ బాల్టిస్థాన్‌లో(Gilgit-Baltistan) పాకిస్తాన్‌ కూడా సైన్యాన్ని దించింది.

ఆక్రమిత కశ్మీర్‌కు భారీగా పాక్‌ దళాలు:
ఆక్రమిత కశ్మీర్‌కు పాకిస్తాన్‌ కూడా భారీగా సైనిక బలగాలను తరలిస్తోంది. గిల్గిత్‌ బాల్టిస్థాన్‌లోని ఎల్‌వోసీ వెంట దాదాపు 20వేల మంది పాక్‌ సైనికులను మోహరించినట్టు భారత నిఘావర్గాలు గుర్తించాయి. గిల్గిత్‌ బాల్టిస్థాన్‌ ప్రాంతం లఢక్‌కు పశ్చిమ భాగంలో ఉంటుంది.

కశ్మీర్‌లో మారణహోమం సృష్టించేందుకు పాక్ ఉగ్రవాదులతో చైనా చర్చలు:
ఓవైపు పాకిస్తాన్ ఆర్మీ సాయం తీసుకుంటూనే మరోవైపు పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలతోనూ చర్చలు జరుపుతోంది డ్రాగన్. జమ్ముకశ్మీర్‌లో మారణహోమం సృష్టించేందుకు పాక్‌కు చెందిన అల్‌బదర్‌ ఉగ్రవాద సంస్థతో చైనా ఆర్మీ అధికారులు చర్చలు జరిపినట్టు భారత నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ కుతంత్రంతో దీటుగా సమాధానం చెప్పేందుకు భారత్‌ కూడా సిద్ధమైంది. అటు జమ్మూకశ్మీర్‌లోకి మరింత మంది ఉగ్రవాదులను చొప్పించేందుకు చైనా ప్రోత్సాహంతో పాకిస్తాన్ ముమ్మర ప్రయాత్నాలు చేస్తోంది. పాక్ కమాండోలు, ఉగ్రవాదులతో కూడిన బ్యాట్(BAT) దళాలతో సరిహద్దు వెంబడి భారత భద్రతా దళాలపై దాడుల చేయాలనే యోచనలో కూడా ఉందట. చైనాతో భారత్‌కు ఉన్న వివాదం అడ్డుపెట్టుకుని తన లక్ష్యాలను నెరవేర్చుకోవాలన్న పాక్ కుయుక్తులను పసిగట్టిన భారత వర్గాలు అలర్ట్ అయ్యాయి. ప్రతి వ్యూహాలు రచిస్తున్నాయి.

100మంది ఉగ్రవాదులతో టచ్ లో ఉన్న చైనా:
సుమారు 100మంది పాక్ టెర్రరిస్టులతో చైనా చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. కాగా, భారత దళాలు ఇటీవలి కాలంలో కశ్మీర్ లోకి చొరబడ్డ 120 మంది టెర్రరిస్టులను కాల్చి చంపాయి. వారిలో చాలామంది స్థానికులు ఉన్నారు. వీరంతా విదేశీ సంస్థల నుంచి వచ్చే డబ్బు తీసుకుని ఉగ్రవాదులుగా మారినట్టు గుర్తించారు.

డ్రాగన్ ఆర్మీ భారీ సన్నాహాలు, 20వేల మంది సైనికులు మోహరింపు:
గల్వాన్‌లో భారత్‌, చైనా సైన్యాల మధ్య ఘర్షణ జరిగిన తర్వాత ఎల్‌ఏసీ వెంట చైనా సైన్యం భారీగా పెరిగింది. జిన్‌జియాంగ్‌ ప్రావిన్స్‌లో 12 వేలమంది పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ సైనికులు ఎల్‌ఏసీ చేరుకొనేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం. ఇప్పటికే ఎల్‌ఏసీ దగ్గర 20వేల మంది చైనా సైనికులు ఉన్నట్టు భారత సైన్యం గుర్తించింది. జిన్‌జియాంగ్‌లో భారీగా ఆయుధాలు నిల్వచేశారు. సైనికులను వేగంగా తరలించే వాహనాలు కూడా అక్కడ ఉన్నట్టు భారత రక్షణ వర్గాలు తెలిపాయి. చైనా సైన్యం కదలికలను నిశితంగా గమనిస్తున్నామని తెలిపాయి.

బలగాల సంఖ్యను పెంచిన చైనా:
టిబెట్‌ రీజియన్‌లో చైనా సాధారణంగా రెండు డివిజన్ల సైన్యాన్ని నిలిపి ఉంచుతుంది. ఒక్కో డివిజన్‌లో వెయ్యిమంది సైనికులు ఉంటారు. కానీ ప్రస్తుతం నాలుగు డివిజన్ల సైన్యం అక్కడ ఉందని సమాచారం. చైనా సైనికుల కదలికలు పెరగటంతో తూర్పు లఢక్‌లో భారత్‌ కూడా సైన్యాన్ని పెంచింది. ఈ ప్రాంతంలో సాధారణం కంటే రెండు డివిజన్ల సైనికులను ఎక్కువగా మోహరించింది. వీరిలో రిజర్వు మౌంటెయిన్‌ డివిజన్‌ కూడా ఉంది. ఈ డివిజన్‌ ఏటా ఈ ప్రాంతంలో సైనిక విన్యాసాలు నిర్వహిస్తుంది. యుద్ధ ట్యాంకులు, బీఎంపీ-2 ఇన్‌ఫాంట్రీ కంబాట్‌ వాహనాలను కూడా అందుబాటులో ఉంచారు. తూర్పు లఢక్‌లో ఎల్‌ఏసీ వెంట భద్రతను ప్రస్తుతం త్రిశూల్‌ ఇన్‌ఫాంట్రీ డివిజన్‌తోపాటు మరో మూడు స్థానిక బ్రిగేడ్లు పర్యవేక్షిస్తున్నాయి.

విడతలవారీగా బలగాల ఉపసంహరణ:
జూన్ 15న గల్వాన్‌ లోయలో భారత్‌, చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగిన తర్వాత పాక్‌, చైనా అధికారుల మధ్య నిత్యం సంప్రదింపులు జరుగుతున్నాయి. లఢక్‌లో వాస్తవాధీన రేఖ వెంట విడుతలవారీగా సైన్యాన్ని ఉపసంహరించాలని భారత్‌-చైనా నిర్ణయించాయి. రెండు దేశాల లెఫ్టినెంట్‌ జనరల్స్ బుధవారం(జూలై 1,2020) 12గంటలపాటు జరిపిన చర్చల్లో ఈ మేరకు నిర్ణయించినట్టు భారత ప్రభుత్వవర్గాలు తెలిపాయి.

Read:భారత్‍పై పాకిస్తాన్ భారీ కుట్ర, ఎల్‌వోసీ వెంట చైనాకు మద్దతుగా 20వేల మంది సైనికులు మోహరింపు