Corona Virus : మరోసారి ప్రమాద ఘంటికలు మోగిస్తున్న కరోనా
కరోనా ముప్పు నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రపంచ దేశాల్లో మళ్లీ అలజడి రేగింది. కొన్ని దేశాల్లో ఇప్పుడు కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.
Corona virus boom : కరోనా మహమ్మారి మరోసారి ప్రపంచానికి పెనుసవాల్ విసురుతోంది. పీడ విరగడైపోయిందనుకున్న టైమ్లో కొన్ని దేశాల్లో కేసులు పెరుగుతుండడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రమాదపు అంచూన ప్రపంచం ఉందంటూ వార్నింగ్ ఇచ్చింది. కరోనా ముప్పు నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రపంచ దేశాల్లో మళ్లీ అలజడి రేగింది. కొన్ని దేశాల్లో ఇప్పుడు కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. చైనాలో స్టెల్త్ ఒమిక్రాన్ దడపుట్టిస్తోంది. కొవిడ్ భయాలతో చైనాలోని చాంగ్చున్, షెన్జెన్ సహా పలు ప్రధాన నగరాలు లాక్డౌన్లోకి వెళ్లిపోయాయి.
మరోవైపు దక్షిణకొరియాలోనూ కరోనా బుసలు కొడుతుంది. రోజురోజుకు దక్షిణ కొరియాలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. కొవిడ్ కేసులతో పాటు మరణాలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. వేగంగా వ్యాపిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా దక్షిణకొరియాలో ఒక్కరోజే 6లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి దక్షిణ కొరియాలో ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. రాజధాని సియోల్ నగరం పరిధిలో ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాపిస్తోంది.
Corona New Variant: ఇజ్రాయిల్ లో కరోనా కొత్త వేరియంట్..!
దక్షిణ కొరియాలో వారం రోజులుగా రోజూ సగటున 3 లక్షల మందికి పైగా కరోనా బారిన పడుతున్నారు. ఈ వారం రోజుల్లోనే దక్షిణ కొరియాలో 23 లక్షల కేసులు నమోదయ్యాయి. దక్షిణ కొరియాలోని 87 శాతం జనాభాకు ఇప్పటికే వ్యాక్సినేషన్ పూర్తవగా.. 62.7 శాతం జనాభాకు టీకా బూస్టర్ డోసులు కూడా వేశారు. అయినా కూడా కేసుల ప్రవాహం ఆగడంలేదు. మరోవైపు హాంకాంగ్లోనూ 29 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. అయితే కొవిడ్ మృతుల్లో ఎక్కువమంది టీకా తీసుకోని వృద్ధులేనని హాంకాంగ్ అధికారవర్గాలు చెబుతున్నాయి.
అటు వియత్నాంలో కూడా కరోనా ఉద్ధృతంగా వ్యాపిస్తోంది. వియత్నాంలో గడిచిన వారంలో 18 లక్షల మంది మహమ్మారి బారిన పడ్డారు. చైనా, దక్షిణ కొరియా, వియత్నాం దేశాల్లో మళ్లీ మహమ్మారి విజృంభించడానికి ఒమిక్రాన్ బీఏ.2 సబ్ వేరియంట్ కారణం అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీనే స్టెల్త్ ఒమిక్రాన్ అని పిలుస్తున్నారు. అటు ఇజ్రాయిల్ శాస్త్రవేత్తలు కొత్త కరోనా వేరియంట్ను గుర్తించినట్లు చెబుతుండడం మరింత ఆందోళన కలిగిస్తోంది.
బెన్ గురియన్ విమానాశ్రయానికి చేరిన ఇద్దరు ప్రయాణీకులకు పీసీఆర్ టెస్ట్ నిర్వహించగా కొత్త వేరియంట్ విషయం తెలిసిందని ఇజ్రాయిల్ ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. ఒమిక్రాన్కు చెందిన రెండు సబ్వేరియంట్లు బీఏ.1, బీఏ.2ను కలిసి కొత్త వేరియంట్ పుట్టిందని చెబుతోంది. రెండు స్ట్రెయిన్లు కలిగిన కొత్త వేరియంట్ సోకిన ఇద్దరు వ్యక్తులకు జ్వరం, తలనొప్పి, కండరాల బలహీనత లాంటి లక్షణాలన్నట్లు వివరించింది. అయితే దీనిపై ప్రపంచ ఆరోగ్యసంస్థ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు..!
ఇక చైనా, తూర్పు ఆసియా దేశాల్లో కరోనా ఉధృతితో భారత్లోని అధికారులు అలర్ట్ అయ్యారు. అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ సూచించారు. మార్చి 27 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను ప్రారంభించనుండడంతో దేశంలో కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్పై ఆయన సమీక్షించారు. జీనోమిక్ సీక్వెన్సింగ్ను పెంచాలని అధికారులకు మాండవీయ అధికారులకు సూచించారు.