Texas School : టెక్సాస్లో మారణహోమం.. మరుసటిరోజే స్కూల్ బయట తుపాకీతో మరో విద్యార్థి..!
Texas School : పసివాళ్లపై ఓ 18 ఏళ్ల యువకుడు మారణ హోమం సృష్టించాడు. అమెరికాలోని టెక్సాస్లో బడిపిల్లలు, టీచర్లపై తుపాకీతో కాల్పులు జరిపాడు.
Texas School : పసివాళ్లపై ఓ 18 ఏళ్ల యువకుడు మారణ హోమం సృష్టించాడు. అమెరికాలోని టెక్సాస్లో బడిపిల్లలు, టీచర్లపై తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల ఘటనలో 19 మంది విద్యార్థులు, ఇద్దరు టీచర్లు ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. ఈ అమానుష ఘటన యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. మే 24న అమెరికాలోని టెక్సాస్ ఎలిమిమెంటరీ స్కూళ్లలో ఈ కాల్పుల ఘటన జరిగింది. ఈ ఘటన జరిగిన మరుసటి రోజున ఓ విద్యార్థి టెక్సాస్ స్కూల్ బయట తుపాకీతో నడుచుకుంటూ వెళ్తూ కనిపించాడు.
వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆ హైస్కూల్ విద్యార్థిని అరెస్ట్ చేశారు. టెక్సాస్లో 18ఏళ్లు దాటిన యువకులు ఎవరైనా లైసెన్స్ లేకుండానే తుపాకీలు కొనుగోలు చేయొచ్చు. ఇదే అక్కడి గన్ కల్చర్ పెరగడానికి దారితీసింది. అమెరికాలో తుపాకుల వాడకంపై ఆంక్షలు విధించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కాల్పుల ఘటనపై స్పందిస్తూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. శక్తిమంతమైన ‘గన్ లాబీ’కి కళ్లెం వేయడానికి శాసనకర్తలు నడుం బిగించాలంటూ దేశాధ్యక్షుడు బైడెన్ పిలుపునిచ్చారు. ఆయుధాల వినియోగంపై ఆంక్షలు విధించాల్సిన సమయం వచ్చిందని అన్నారు.
అమెరికా కాలమానం ప్రకారం.. మంగళవారం ఉదయం 11.32 గంటలకు సాల్వడార్ రామోస్ అనే 18ఏళ్ల యువకుడు టెక్సాస్లోని యువాల్డీ నగరంలో రాబ్ ప్రాథమిక పాఠశాలలో తుపాకీతో కాల్పులు జరిపాడు. రక్షణ కవచం ధరించి AR-15 సెమీ ఆటోమేటిక్ తుపాకీతో విద్యార్థులపై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో 5 నుంచి 10 ఏళ్ల లోపు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ముష్కరుడు తన 18వ పుట్టినరోజున రెండు తుపాకులను కొనుగోలు చేశాడు. స్కూల్లో కాల్పులు జరపడానికి ముందే రామోస్.. తన సొంత నానమ్మను కూడా కాల్చిచంపినట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనా స్థలంలోనే పోలీసులు హంతకుడిని హతమార్చారు.
Read Also : Texas shooting: అమెరికాలోని ఓ స్కూల్లో కాల్పులు.. 18 మంది విద్యార్థులతో సహా 21 మంది మృతి