India-Germany: భారత పర్యటనకు వచ్చి చైనా పై నిప్పులు చెరిగిన జర్మన్ అధికారి
భారత్ పర్యటనలో ఉన్న కే-అచిమ్ షాన్బాచ్ చైనా గురించి సంచలన వ్యాఖ్యలు చేయడం అంతర్జాతీయంగా చర్చినీయాంశం అయింది. చైనాకు ధీటుగా బదులిచ్చేందుకు భారత్ తో కలిసి పనిచేస్తామన్న షాన్బాచ్.
India-Germany: భారత్ – జర్మనీ దేశాల నావికాదళాల మధ్య పరస్పర సహకారాలను మరింత బలపరుచుకునేందుకు న్యూ ఢిల్లీ చేరుకున్న జర్మన్ నేవీ చీఫ్ కే-అచిమ్ షాన్బాచ్ చైనాపై నిప్పులు చెరిగారు. అంతర్జాతీయంగా చైనా చేస్తున్న దురాక్రమణలపై మండిపడ్డ షాన్బాచ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ కు అనుకూలంగా వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఢిల్లీలో భారత నేవీ అడ్మిరల్ R హరి కుమార్ CNSతో సమావేశ అనంతరం షాన్బాచ్ మీడియాతో ప్రస్నోత్తరాల సమయంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు బదులిస్తూ.. చైనాపై విరుచుకుపడ్డారు.
Also read: Afghanistan – India: అతి త్వరలో భారత్ నుంచి పాక్ మీదుగా ఆఫ్ఘన్కు చేరనున్న గోధుమలు
చైనా.. తన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (BRI) కింద చిన్న చిన్న దేశాల్లో మౌలిక వసతులు కల్పిస్తూ.. ఆయా దేశాలకు అసాధారణ రీతిలో రుణాలు అందిస్తుందని.. అప్పులు చెల్లించలేక ఆయా దేశాలు తీవ్ర సంక్షభంలో చిక్కుకుని అల్లాడిపోతున్నాయని.. షాన్బాచ్ వివరించారు. ప్రపంచ దేశాలను చైనా తమ చెప్పుచేతల్లోకి తీసుకోవాలని చూస్తోందని..అదే జరిగితే తెలియకుండానే అనేక దేశాలకు చైనా శత్రువుగా మారుతుందని షాన్బాచ్ పేర్కొన్నారు. ఆఫ్రికా, మధ్య యూరోప్ లోని కొన్ని దేశాల్లో చైనా పెట్టుబడులు పెట్టి ఆయా దేశాల్లో పెత్తనం చెలాయించాలని చూస్తుందని విమర్శించారు. ఆయా దేశాల్లో మౌలిక వసతుల పేరుతో జరుగుతున్న పనుల్లో సిబ్బంది మొత్తం చైనీయులే ఉన్నారని, చైనా వస్తువులే ఉంటున్నాయని షాన్బాచ్ తెలిపారు. “ఒక్క మాటలో చెప్పాలంటే ఆయా దేశాల్లోని సహజ వనరులను తరలించుకునేందుకు అక్కడి నియంతలకు, నరహంతకులకి, నేరస్థులకు చైనా డబ్బు ఇస్తోందని” కే-అచిమ్ షాన్బాచ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Also read: Bose Statue: తెలంగాణ గ్రానైట్ రాయితో సుభాష్ చంద్రబోస్ విగ్రహం తయారు
చైనాతో జర్మనీకి ఎప్పుడూ సత్సంబంధాలు ఉండేవన్న షాన్బాచ్, తమ దేశంలో 5జి సాంకేతికతను అభివృద్ధి చేసేందుకు చైనా మొబైల్ సంస్థ “హువావే”తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. అయితే చైనాతో అన్ని విషయాలు తమకు అనుకూలంగానే ఉన్నట్లు ముందుగా భావించినా, అనంతరం చైనా కుటిలత్వాన్ని గుర్తించి జర్మనీ కూడా తడబడినట్లు కే-అచిమ్ షాన్బాచ్ చెప్పుకొచ్చారు. అందుకు ఉదాహరణగా .. జర్మనీకి చెందిన “Kuka Robotics” సంస్థను చైనా కొనుగోలు చేయడం వెనుక ఆంతర్యాన్ని చెప్పుకొచ్చారు. సాంకేతికతతో దూసుకుపోతున్న జర్మనీ సంస్థ Kuka Robotics ని చైనాలోని ఒక ప్రైవేట్ సంస్థ కొనుగోలు చేసిందని, తమ సాంకేతికతను పూర్తిగా తీసుకున్న చైనా అనంతరం పత్తాలేకుండా పోయిందని షాన్బాచ్ దుయ్యబట్టారు.
Also read: Mumbai Building Fire : ముంబైలో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, 17 మందికి గాయాలు
ఇరు దేశాల మధ్య పరస్పర సాంకేతికతను ఇచ్చిపుచ్చుకునే పద్దతిలో జరిగిన ఆ ఒప్పందాన్ని చైనా విస్మరించిందని, అప్పుడే “చైనా నీచపు అజెండా” తమకు అర్థమైందని షాన్బాచ్ మండిపడ్డారు. చైనా తాము అనుకున్నంత మంచి దేశం కాదని ఇప్పుడు చైనా తమకు “ఒక శత్రువు కంటే ఎక్కువ” అంటూ జర్మన్ నేవీ చీఫ్ కే-అచిమ్ షాన్బాచ్ వ్యాఖ్యానించారు. భారత్ పర్యటనలో ఉన్న కే-అచిమ్ షాన్బాచ్ చైనా గురించి ఈ వ్యాఖ్యలు చేయడం అంతర్జాతీయంగా చర్చినీయాంశం అయింది. చైనాకు ధీటుగా బదులిచ్చేందుకు భారత్ వంటి దేశాలతో కలిసి పనిచేస్తామని షాన్బాచ్ తెలిపారు.
Also read: World War 2: రెండో ప్రపంచ యుద్ధ కాలంనాటి “మిస్సింగ్ ఫ్లైట్” 80 ఏళ్ల తరువాత భారత్ లో దొరికింది