IND VS PAK : 75ఏళ్ల స్వతంత్రావనిలోకి భారత్‌, పాక్‌..ఈ 75ఏళ్లలో రెండు దేశాల ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయ్..? తేడాలేంటీ..?

ఒకరోజు అటు ఇటుగా.. భారత్, పాకిస్తాన్‌కు స్వాతంత్ర్యం లభించింది. రెండు దేశాలు ప్రయాణాన్ని ఒకేసారి మొదలుపెట్టినా..స్వాతంత్ర్యం సాధించిన ఈ 75 ఏళ్లలో రెండు దేశాల ప్రయాణం ఎలా సాగింది. ఆర్థికంగా రెండు దేశాలు ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయంటే..

IND VS PAK : 75ఏళ్ల స్వతంత్రావనిలోకి భారత్‌, పాక్‌..ఈ 75ఏళ్లలో రెండు దేశాల ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయ్..? తేడాలేంటీ..?

IND VS PAK

IND VS PAK : ఒకరోజు అటు ఇటుగా.. భారత్, పాకిస్తాన్‌కు స్వాతంత్ర్యం లభించింది. ఓ సమయంలో ఆర్థికంగా భారత్‌కు మించి అనిపించిన పాకిస్తాన్‌.. ఆ తర్వాత దారుణంగా పడిపోయింది. పడిపోవడాన్ని అలవాటుగా చేసుకుంది. ఇంతకీ 75 ఏళ్లలో రెండు దేశాల ప్రయాణం ఎలా సాగింది. ఆర్థికంగా రెండు దేశాలు ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయ్.

దాయాది దేశాలైన భారత్‌, పాకిస్తాన్‌… 1947లోనే ఇండిపెండెంట్‌ జర్నీ ప్రారంభించాయ్. చరిత్ర కావొచ్చు.. సంప్రదాయాలు కావొచ్చు.. రెండు దేశాల మధ్య ఎప్పుడూ పోటీ కనిపిస్తూనే ఉంది. పోటీ కాస్త వైరానికి.. ఆ తర్వాత యుద్ధానికి దారితీసింది. క్రికెట్ మ్యాచ్‌ల్లోనే కాదు.. అంతకుమించి రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. 75 ఏళ్ల ప్రయాణంలో భారత్, పాకిస్తాన్ ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాయ్. రెండు దేశాలు తీసుకున్న ఆర్థిక నిర్ణయాలు.. ప్రపంచంలో ప్రత్యేక స్థానం కల్పించాయ్. ప్రజాస్వామ్య భారతం ఒక్కో అడుగు ముందుకేస్తుంటే.. అస్థిర రాజకీయాలు, మిలటరీ జోక్యం పాకిస్తాన్‌ను రోజురోజుకు వెనక్కి లాగుతున్నాయ్.

భారత్, పాకిస్తాన్ మధ్య ప్రధాన తేడా.. రాజకీయ పరిస్థితులు. మధ్యలో 21నెలల ఎమర్జన్సీని మినహాయిస్తే.. 75ఏళ్లుగా భారత్‌లో ప్రజాస్వామ్యానికి ఎలాంటి అవరోధం ఏర్పడలేదు. అదే ప్రపంచ పటంలో భారత్‌ను ప్రత్యేక పరిస్థితుల్లో నిలబెట్టింది. ఐతే పాకిస్తాన్‌లో అలాంటి పరిస్థితి లేదు. 1947లో స్వాతంత్ర్యం దక్కించుకున్న తర్వాత.. పాక్‌లో పరిస్థితులు రకరకాలుగా మారిపోయాయ్. నాయకులను తొక్కి సైనికాధికారులు పాలనా పగ్గాలు లాక్కుని పాలించిన రోజులు ఉన్నాయ్. ప్రజాస్వామ్య పాలన ఒకసారి.. నిరంకుశ ధోరణి మరోసారి.. ఇలా పాక్‌లో పాలకులు రకరకాలుగా మారిపోయారు. దీంతో ఆ ప్రభావం ఆ దేశం మీద క్లియర్‌గా కనిపించడం మొదలుపెట్టింది.

పాకిస్తాన్‌లో ఇప్పటివరకు ఏ ప్రధాని కూడా పూర్తిగా పదవీకాలం అనుభవించలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ముగ్గురు ప్రధానులను ఆర్మీ దింపేస్తే.. నలుగురు ఆర్మీ చీఫ్‌లు పాక్‌కు అధ్యక్షులుగా పనిచేశారు. 75ఏళ్లలో సగానికి పైగా పాకిస్తాన్‌ సైనిక పాలనలోనే కనిపించింది. ఇక ఆర్థికంగా చూస్తే.. మన దేశంలో ఏర్పాటైన స్థిరమైన ప్రభుత్వాలు.. ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిపై దృష్టి సారించాయ్. గ్లోబల్‌ సూపర్ పవర్‌గా నిలిపేలా చేశాయ్. 75 ఏళ్లలో రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలో ఎన్నో మార్పులు కనిపించాయ్. 1960 దశకంలో భారత్‌ తలసరి ఆదాయంతో కంపేర్ చేస్తే.. పాకిస్తాన్ ముందు ఉండేది. అలాంటిది 60ఏళ్లలో సీన్ పూర్తిగా మారిపోయింది. భారత్ పవర్‌గా మారితే.. మిగతా దేశాల మీద దయాదాక్షిణ్యాల మీద ఆధారపడే స్థితికి పాకిస్తాన్‌ చేరుకుంది.

గత ఏడు దశాబ్దాలుగా భారత ఆర్థిక వ్యవస్థ అనేక హెచ్చు తగ్గులు చూసింది. 1947లో భారతదేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) రూ. 2.7 లక్షల కోట్లుగా ఉండగా.. ఇప్పుడు 3.17 ట్రిలియన్ యూఎస్ డాలర్లకు పెరిగింది, భారతదేశాన్ని ఆరవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చింది. 2031 నాటికి భారతదేశం మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని అంచనా. ఐతే పాకిస్తాన్ పరిస్థితి మాత్రం రోజురోజుకు దిగజారుతోంది. అప్పుల్లో కూరుకుపోయి.. పాక్ ఆర్థిక వ్యవస్థ బలహీనంగా మారుతోంది. 1960ల్లో భారత జీడీపీ 37.03 బిలియన్‌ డాలర్లుగా ఉండగా.. 2021కి 3.17 ట్రిలియన్‌ డాలర్‌కు చేరుకుంది. 1960లో 3.74 బిలియన్ డాలర్లుగా ఉన్న పాక్ జీడీపీ.. 2021కు ఎదిగింది 346 బిలియన్‌ డాలర్లకు మాత్రమే ! అక్కడి రాజకీయమే ఈపరిస్థితికి కారణంగా కనిపిస్తోంది.

ఒకేసారి ప్రయాణం మొదలుపెట్టిన భారత్‌, పాక్ పరిస్థితులు ఇప్పుడు పూర్తి విరుద్ధంగా మారిన పరిస్థితి. శ్రీలంకలాంటి దేశానికి సాయం చేసే స్థాయికి భారత్ చేరుకుంటే.. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ ఇచ్చే అప్పుల కోసం ఆతృతగా ఎదురుచూసే పరిస్థితికి పాకిస్తాన్ చేరుకుంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ తగ్గినా.. విదేశీ మారకం విషయంలో భారత్ అద్భుతమైన చర్యలు తీసుకుంటుంటే.. పాకిస్తాన్‌లో మాత్రం విదేశీ మారకం విలువ సింగిల్ డిజిట్‌ బిలియన్లకు పడిపోయింది. 75ఏళ్ల భారత్ సూపర్ పవర్‌గా ఎదుగుతుంటే.. ఉగ్రవాదానికి పాలు పోస్తూ.. విద్రోహ చర్యలకు పాల్పడుతూ.. ఆర్థికంగా ఊబిలో చిక్కుకుంటుంది పాకిస్తాన్‌.