Ukraine Children: యుక్రెయిన్లో పసిపిల్లల వీపుపై వివరాలు రాస్తున్న తల్లిదండ్రులు: ఎందుకంటే?
ఈ యుద్ధం కారణంగా తాము మృతి చెందినా..మరొక ప్రాంతానికి వెళ్లినా పిల్లలు బ్రతికి బయటపడితే ప్రభుత్వం వారిని తమ వద్దకు చేర్చడమో లేక చేరదీయడమో చేస్తుందని భావించి వారు ఈ విధంగా చేస్తున్నా

Ukraine
Ukraine Children: రష్యా తలపెట్టిన యుద్ధం యుక్రెయిన్ లో పెను విషాదాన్ని మిగిల్చింది. గత 41 రోజులుగా యుక్రెయిన్ లో రష్యా మారణహోమం సృష్టించింది. నగరాలకు నగరాలనే ధ్వంసం చేసిన రష్యా సేనలు..యుద్ధ ధర్మాన్ని మరచి సాధారణ ప్రజలను సైతం పొట్టనబెట్టుకున్నారు. యుద్ధం కారణంగా శరణార్థులుగా తరలివెళ్తున్న యుక్రెయిన్ ప్రజలు తమ చిన్నారుల భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రష్యా సైనికుల చేతిలో పొరబాటున తాము హత్యకు గురైనా..తమ చిన్నారుల క్షేమంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న కొందరు తల్లిదండ్రులు..ప్రభుత్వం నిర్వహించే రక్షణ శిబిరాల వద్ద చిన్నారులను వదిలి వెళ్తున్నారు. ఈతరుణంలో చిన్నారుల వీపుపై..తల్లిదండ్రుల పేరు, అడ్రెస్స్ తో పాటు..ఫోన్ నెంబర్ ఇతర వివరాలు రాస్తూ శిబిరాల వద్ద వదిలి వెళ్తున్నారు యుక్రెయిన్ ప్రజలు.
Also read:Russian Troops : రష్యా రాక్షసత్వం.. యుక్రెయిన్ మేయర్ కిడ్నాప్.. హింసించి దారుణహత్య..!
ఈ యుద్ధం కారణంగా తాము మృతి చెందినా..మరొక ప్రాంతానికి వెళ్లినా పిల్లలు బ్రతికి బయటపడితే ప్రభుత్వం వారిని తమ వద్దకు చేర్చడమో లేక చేరదీయడమో చేస్తుందని భావించి వారు ఈ విధంగా చేస్తున్నారు. ఈ విషయంపై యుక్రెయిన్ కి చెందిన ప్రముఖ జర్నలిస్ట్ అనస్తీసియా లపతినా ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ..యుక్రెయిన్ తల్లిదండ్రులు తమ పిల్లల గురించి దిగులు చెందుతుంటే యురోపియన్ యూనియన్ నేతలు తమ గ్యాస్ అవసరాల కోసం చర్చించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పసివయసులోనే చిన్నారులు తల్లిదండ్రుల నుంచి వేరు కావడం దురదృష్టమని ఆమె వ్యాఖ్యానించారు. కాగా యుద్ధం పేరుతో యుక్రెయిన్ లోకి చొరబడిన రష్యా సేనలు మానవత్వం మరచి యుక్రెయిన్ ప్రజలపై దాష్టికాలకు ఒడిగట్టారు. మహిళలు, చిన్నారులు, వృద్ధులు ఇలా తమకు ఎదురొచ్చిన వారెవరైనా సరే నిర్ధాక్షిణ్యంగా కాల్చి చంపారు రష్యా సైనికులు. ఇటీవల యుక్రెయిన్ నగరాలను వీడి రష్యా సేనలు సరిహద్దుకు వెళ్ళిపోతున్న తరుణంలో తమ నివాసాలకు చేరుకుంటున్న యుక్రెయిన్ ప్రజలు..కళ్లు నమ్మలేని దారుణ దృశ్యాలను చవిచూస్తున్నారు. రష్యా సైనికుల దారుణాలు ఒక్కొక్కటిగా ప్రపంచానికి తెలుస్తున్నాయి.