జపాన్ ఎన్నికల్లో భారతీయ ‘యోగి’ ఘన విజయం

  • Published By: venkaiahnaidu ,Published On : April 24, 2019 / 03:34 AM IST
జపాన్ ఎన్నికల్లో భారతీయ ‘యోగి’ ఘన విజయం

జపాన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో మొదటిసారిగా ఓ భారత సంతతి వ్యక్తి ఘన విజయం సాధించారు.ఏప్రిల్-21,2019న జరిగిన ఈ ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ జపాన్ మద్దతుతో టోక్యోలోని ఎడొగావా వార్డ్ అసెంబ్లీ నుంచి పురానిక్ యోగేంద్ర(41)గెలుపొందారు.యోగేంద్రను అందరూ యోగి అని పిలుస్తుంటారు. ఎడొగావా వార్డులో ఆయనకు 6,477 ఓట్లు వచ్చాయి. ఎన్నికల్లో విజయం పట్ల యోగి సంతోషం వ్యక్తం చేశారు.జపనీస్,విదేశీయుల మధ్య తాను ఓ బ్రిడ్జిగా ఉండాలనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు సేవలందిస్తాన్ననారు. 

1997లో విద్యార్థిగా ఉన్నప్పుడు యోగేంద్ర జపాన్‌ వెళ్లారు. రెండేండ్ల తర్వాత తిరిగి భారత్‌ కు చేరుకున్నారు. చదువు పూర్తయిన తర్వాత ఇంజినీర్‌ గా పనిచేయడానికి తిరిగి జపాన్‌కు వెళ్లారు. 2005 నుంచి ఎడొగావా వార్డులో నివాసం ఉంటున్నారు. 2011లో జపాన్‌లో సునామీ వచ్చినప్పుడు బాధితులకు సహాయ సహకారాలు అందించిన ఆయన సేవలను గుర్తించిన జపాన్ ప్రభుత్వం యోగికి 2012లో ఆ దేశ పౌరసత్వం ఇచ్చింది.