షాక్ ఇచ్చిన లండన్ కోర్టు : నీరవ్ మోడీకి అరెస్ట్ వారెంట్

  • Published By: sreehari ,Published On : March 19, 2019 / 10:13 AM IST
షాక్ ఇచ్చిన లండన్ కోర్టు : నీరవ్ మోడీకి అరెస్ట్ వారెంట్

లండన్ : పంజాబ్ నేషనల్ బ్యాంకు రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన భారత వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీకి యూకే కోర్టు షాక్ ఇచ్చింది. రూ.13వేల 500 కోట్ల పీఎన్ బీ బ్యాంకు మోసం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నీరవ్ కు వెస్ట్ మినిస్టర్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. మార్చి 13న కోర్టు అరెస్ట్ వారీ జారీ చేసినట్టు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ధ్రువీకరించింది.

మనీలాండరింగ్ కేసులో విదేశాలకు పారిపోయిన నీరవ్ ను తిరిగి భారత్ కు రప్పించే విషయంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందంటూ కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది. ఈ క్రమంలో లండన్ లో తలదాచుకున్న నీరవ్.. త్రి బెడ్ రూం ప్లాట్ లో ఉంటున్నట్టు టెలిగ్రాఫ్ నివేదించింది. లండన్ కోర్టు ఆదేశాల మేరకు అక్కడి పోలీసులు నీరవ్ ను త్వరలో అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. 

అరెస్ట్ చేసిన వెంటనే లండన్ పోలీసులు మోడీని వెస్ట్ మినిస్టర్ కోర్టులో హాజరుపరిచి విచారించే అవకాశం ఉంది. నీరవ్ ను భారత్ కు అప్పగించే విషయమై ఈడీకి యూకే హోం ఆఫీసు నుంచి ఓ మెయిల్ వచ్చిందని, అందులో హోం సెక్రటరీ భారత్ అప్పీల్ ను ఆమోదించినట్టు తెలుస్తోంది. అది నేరుగా కోర్టుకు సమర్పించనున్నట్టు సమాచారం. మనీలాండరింగ్ యాక్ట్ కింద నీరమ్ సహా పలువురిపై ఈడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

అంతకుముందు ఇదే కేసుపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. పీఎంఎల్ఎ యాక్ట్ కింద నీరవ్ మోడీ రూ.1,873.08 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. నీరవ్ ఆస్తులు, ఆయన కుటుంబ సభ్యులపై ఉన్న రూ.489.75 కోట్ల ఆస్తులను కూడా ఈడీ స్వాధీనం చేసుకుంది.