North Korea : తగ్గేదే లే అంటున్న కిమ్..మరో మిసైల్ ప్రయోగం

వరుస మిసైల్ టెస్ట్ లతో ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది ఉత్తర కొరియా. వరుస బాలిస్టిక్​ క్షిపణి ప్రయోగాలు చేపడుతూ వస్తున్న ఉత్తర కొరియా మంగళవారం ఉదయం స్వల్ప దూరంలోని లక్ష్యాలను

North Korea : తగ్గేదే లే అంటున్న కిమ్..మరో మిసైల్ ప్రయోగం

Korea

North Korea  వరుస మిసైల్ టెస్ట్ లతో ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది ఉత్తర కొరియా. వరుస బాలిస్టిక్​ క్షిపణి ప్రయోగాలు చేపడుతూ వస్తున్న ఉత్తర కొరియా మంగళవారం ఉదయం స్వల్ప దూరంలోని లక్ష్యాలను ఛేదించగల షార్ట్​ రేంజ్​ మిస్సైల్​ను సముద్రంలోకి ప్రయోగించింది. ఉత్తర కొరియాలోని జగాంగ్​ ప్రావిన్స్​ నుంచి తూర్పువైపు సముద్రంలోకి ప్రొజెక్టైల్​ను ప్రయోగించినట్లు దక్షిణ కొరియా వెల్లడించింది. అయితే దక్షిణ కొరియాతో శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటించిన కొద్దిరోజుల్లోనే.. కిమ్​ ప్రభుత్వం మరో మిసైల్ పరీక్ష నిర్వహించడం ఉత్తర కొరియా నిబద్ధతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఉత్తర కొరియా మిసైల్ ప్రయోగం నేపథ్యంలో..జాతీయ అత్యవసర భద్రతా మండలి సమావేశం ఏర్పాటు చేసిన దక్షిణ కొరియా ప్రభుత్వం కిమ్​ సర్కార్​ చర్యపై విచారం వ్యక్తం చేసింది. అమెరికా- దక్షిణ కొరియా అధికారులు దీనిని విశ్లేషిస్తారని స్పష్టం చేసింది.

ఇక,ఉత్తరకొరియా చర్యను అమెరికా ఖండించింది.ఇది పొరుగు దేశాలకు, అంతర్జాతీయ సమాజానికి ముప్పును పెంచుతోందని తెలిపింది. ఉభయ కొరియా దేశాలు చర్చల ద్వారా ఉద్రిక్తతలకు తెరదించాలని అమెరికా హోంశాఖ కోరింది.

కాగా,ఈ నెల మెదట్లో ఉత్తరకొరియా బాలిస్టిక్,క్రూజ్ క్షిపణులను ప్రయోగించింది. అయితే బాలిస్టిక్​ క్షిపణి ప్రయోగాలు చేపట్టకుండా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఇప్పటికే ఉత్తర కొరియాపై ఆంక్షలు విధించింది. వీటిని లెక్కచేయని కిమ్​ ప్రభుత్వం.. ఈ నెల మొదట్లో బాలిస్టిక్​, క్రూయిజ్​ క్షిపణులను ప్రయోగించి ఉద్రిక్తతలు పెంచింది. కానీ.. స్వల్ప శ్రేణి క్షిపణుల ప్రయోగాలపై ఎలాంటి ఆంక్షల్లేవు.

మరోవైపు, ఇటీవల జరిగిన ఐరాస సర్వసభ్య సమావేశంలో దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్​ జే ఇన్​.. 1950-53 నాటి కొరియా యుద్ధం ముగింపు ప్రకటన కోసం తమ ప్రయత్నాన్ని పునరుద్ఘాటించారు. దాని ద్వారా అణ్వాయుధ నిర్మూలన, కొరియా ద్వీపకల్పంలో శాంతి స్థాపనకు దారి తీస్తుందన్నారు. దక్షిణ కొరియా అధ్యక్షుడి వ్యాఖ్యలపై స్పందించిన కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్​ యో జోంగ్​..తమ షరతులకు అంగీకరిస్తే.. చర్చలకు తాము ఎప్పుడూ సిద్ధమేనని సంకేతాలు ఇచ్చారు. ఉద్రిక్తతలు పెంచే విధానాలను, ద్వంద్వ వైఖరిని ఆపేయాలని కోరారు. ఆమె వ్యాఖ్యలపై దక్షిణ కొరియా యూనిఫికేషన్ మంత్రి స్పందిస్తూ.. కిమ్​ యో జోంగ్ ప్రకటన అర్థవంతంగానే ఉన్నప్పటికీ చర్చలకు ముందే ఇరుదేశాల మధ్య కమ్యూనికేషన్​ వ్యవస్థను పునరుద్ధరించాలని సూచించారు. దీనికి ఉత్తరకొరియా స్పందించలేదు.

మరోవైపు, మిసైల్ ప్రయోగం నిర్వహించిన కొద్దిసేపటి తర్వాత, ఉత్తర కొరియా ప్రతినిధి కిమ్ సాంగ్ న్యూయార్క్‌లో జరిగిన వార్షిక UN జనరల్ అసెంబ్లీలో ప్రసంగించారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో భాగంగా చివరిరోజు.. ఉత్తర కొరియా రాయబారి కిమ్​ సంగ్ మాట్లాడుతూ ఆత్మరక్షణ కోసం మరియు ఆయుధాలను పరీక్షించడానికి ఉత్తరకొరియా యొక్క హక్కును ఎవరూ తిరస్కరించలేరని అన్నారు. ఆయుధ వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి, పరీక్షించడానికి, తయారీ చేయడానికి మరియు కలిగి ఉండటానికి ఉత్తరాది కొరియాకు హక్కు ఉందని ఆయన అన్నారు.