అమెరికాలో ముందుగానే ఆరు కోట్ల ఓట్లు వేసేశారు

  • Published By: murthy ,Published On : October 27, 2020 / 10:15 AM IST
అమెరికాలో ముందుగానే ఆరు కోట్ల ఓట్లు వేసేశారు

US Election 2020 :  అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు అంటే మాటలా? అయితే కరోనా కారణంగా దేశంలో ఓట్ల శాతం తగ్గే అవకాశం ఉన్నట్లుగా ఇఫ్పటివరకు భావించారు. అయితే దేశంలో ఓటు వేయడానికి విపరీతమైన ఉత్సాహం చూపిస్తున్నట్లుగా తెలుస్తుంది. 2020 ఎన్నికలకు ఇంకా తొమ్మిది రోజులే మిగిలి ఉండగా.. ఇప్పటివరకు ఎన్నికల ఎర్లీ బ్యాలెట్ ఓటింగ్ విధానంలో ఆరు కోట్ల ఓట్లు పోలయ్యాయి. మునుపటి ఎన్నికలతో పోలిస్తే ఈసారి ముందస్తు ఓటింగ్ ఎక్కువగా కనిపిస్తుంది.

అమెరికాలోని యాభై రాష్ట్రాల్లో ఎన్నికల అధికారులు నిర్వహించిన సర్వేలో ఈ సమాచారం వెల్లడైంది. నివేదిక ప్రకారం, 2016 లో, ఎన్నికలకు ముందు ఓటింగ్‌లో వేసిన ఓట్ల కంటే ఈసారి ఎక్కువ ఓట్లు వస్తున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. అమెరికా దేశంలో 257 మిలియన్లకు పైగా జనాభా 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు ఉండగా.. వీరిలో సుమారు 24 కోట్ల ఓటర్లు ఉన్నారు.



ఈ ఏడాది ఎన్నికలలో ముఖ్యమైన పాత్ర పోషించబోయే 16 రాష్ట్రాల్లో 45 మిలియన్ ఓట్లలో 54 శాతం ఓట్లు ఉన్నాయి. ఈసారి, ఓటు వేయడానికి ముందు 18 నుండి 29 సంవత్సరాల మధ్య వయస్సు గల యువకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. మునుపటి ఎన్నికల కంటే ఈసారి వారి సంఖ్య ఎక్కువ. ఫ్లోరిడా, కరోలినాలో రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ కంటే డెమొక్రాట్ అభ్యర్థి జో బిడెన్ ముందున్నారని ఎన్నికల ముందస్తు సర్వేలు చెబుతున్నాయి.

ట్రంప్ 2016 లో ఫ్లోరిడాలో ఒక శాతం కన్నా తక్కువ ఓట్ల తేడాతో గెలిచారు. ట్రంప్‌కు 49.02 శాతం ఓట్లు రాగా, అతని ప్రత్యర్థి డెమొక్రాట్ హిల్లరీ క్లింటన్‌కు 47.82 శాతం ఓట్లు వచ్చాయి.



ఈసారి సర్వే ప్రకారం, ఫ్లోరిడా ఓటర్లలో 37 శాతం మంది ఎన్నికలకు ముందు ఓటింగ్‌లో ఓటు వేశారు. వీరిలో 71 శాతం మంది ఓటర్లు జో బిడెన్‌కు మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు. ట్రంప్‌తో 27 శాతం మంది కనిపించారు.

దక్షిణ కెరొలినలో రిపబ్లికన్ల కంటే డెమొక్రాట్లు కొంచెం ముందున్నారు, కాని పోటీ మాత్రం గట్టిగానే ఉంటుంది.  అయితే, ఎర్లీ బ్యాలెట్టు లెక్కించేందుకు సమయం పడుతుందని, అందువల్ల ఎన్నికలైన 3వతేదీ తలర్వాతే ఫలితాలు వచ్చే అవకాశాలు లేవని నివేదికలు చెబుతున్నాయి. 2016లో సైతం ఈ ఆలస్యం జరిగిందని, ఈ దఫా జాప్యం మరింత ఎక్కువ కావచ్చునని చెబుతున్నారు.

ప్రధాన ఎన్నికలు పూర్తయిన తర్వాతనే ఎర్లీ బ్యాలెట్లను లెక్కించే పని మొదలెడతారు. ఇవన్నీ పూర్తి కావడానికి మరో ఒకటి రెండు రోజులు పట్టవచ్చని నివేదిక తెలిపింది. ప్రస్తుతం పోలైన 5.87 కోట్ల ఓట్లలో 54 శాతం ఓట్లు కీలకమైన 16 రాష్ట్రాల నుంచి వచ్చాయి.