CAATSA Sanctions : భారత్ పై “కాట్సా” ప్రయోగించవద్దు..బైడెన్ కు సెనెటర్లు లేఖ

రష్యా నుంచి ఎస్‌-400 క్షిపణులను కొనుగోలు చేయకుండా భారత్‌ పై ఆంక్షలు విధించవద్దని కోరుతూ అమెరికాలో ఇద్దరు కీలక సెనేటర్లు

CAATSA Sanctions : భారత్ పై “కాట్సా” ప్రయోగించవద్దు..బైడెన్ కు సెనెటర్లు లేఖ

Biden

CAATSA Sanctions రష్యా నుంచి ఎస్‌-400 క్షిపణులను కొనుగోలు చేయకుండా భారత్‌ పై ఆంక్షలు విధించవద్దని కోరుతూ అమెరికాలో ఇద్దరు కీలక సెనేటర్లు(డెమోక్రాటిక్‌ పార్టీకి చెందిన మార్క్‌ వార్నర్‌, రిపబ్లికన్‌ పార్టీకి చెందిన జాన్‌ కోర్నిన్‌) ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్‌కు లేఖ రాశారు.

రష్యా నుంచి భారత్ క్షిపణుల కొనుగోలుకు అడ్డంకిగా మారే అవకాశం ఉన్న కౌంటరింగ్‌ అమెరికాస్‌ అడ్వర్సరీస్‌ థ్రూ సాంక్షన్స్‌ యాక్ట్‌ (CAATSA) ఆంక్షల్ని భారత్‌ పై అమలు చేయొద్దని లేఖలో సెనెటర్లు కోరారు. ఇది భారత్‌తో పాటు అమెరికా జాతీయ భద్రతకు కూడా సంబంధించిన అంశమని పేర్కొన్నారు. కాట్సా చట్టంలోని నిబంధనల ప్రకారం ఆంక్షల నుంచి మినహాయింపునిచ్చే అధికారం అధ్యక్షుడికి ఉందని పేర్కొన్నారు.

కాగా, 2018లో భారత్‌ 540 కోట్ల డాలర్లతో ఎస్‌-400 క్షిపణులను కొనేందుకు రష్యాతో ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. అయితే అదే ఏడాది అమెరికా కాట్సా చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. కాట్సా అనేది అమెరికా ప్రత్యర్థులపై ఆర్థిక ఆంక్షలను ప్రయోగించడానికి అధికారమిచ్చే చట్టం. అమెరికా దీని కింద రష్యా, ఇరాన్‌, ఉత్తర కొరియా రక్షణ ఉత్పత్తుల సంస్థలతో వ్యాపారం చేసే దేశాలపై ఆంక్షలు విధించవచ్చు. దీంతో ఎస్‌-400 క్షిపణి కొనుగోలుకు కాట్సా అడ్డు తగులుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సెనెటర్లు బైడైన్ కు ఈ లేఖ రాశారు.

రక్షణ,ఇంధనం,వ్యాక్సిన్‌,టెక్నాలజీ వంటి రంగాల్లో భారత్‌ తో ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతమవుతున్నాయని లేఖలో సెనెటర్లు పేర్కొన్నారు. ఈ తరుణంలో ఆంక్షలు విధించడం వల్ల సంబంధాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. అలాగే అమెరికా నమ్మదగిన మిత్రదేశం కాదన్న వాదన భారత్‌ లో బలపడే ప్రమాదం ఉందన్నారు. అలాగే భారత్‌ ప్రాంతీయంగా ఎదుర్కొంటున్న జాతీయ భద్రత ముప్పు దృష్ట్యా ప్రత్యామ్నాయ ఆయుధ కొనుగోళ్లకు మార్గం చూపించాల్సిన అవసరం ఉందన్నారు. అమెరికా అభివృద్ధి చేస్తున్న ఆయుధ, రక్షణ వ్యవస్థలు భారత అవసరాలకు సరిపోతాయన్న నమ్మకం కలిగించాలన్నారు. ఈ మేరకు భారత ప్రభుత్వ యంత్రాంగంతో చర్చలు జరపాలన్నారు.

ALSO READ RJD Chief : ఆరేళ్ల తర్వాత ఎన్నికల ర్యాలీలో లాలూ..అప్పుడే వచ్చుంటే తేజస్వీ ఎప్పుడో సీఎం