డెక్సామిథాసోన్ ఉత్పత్తిని పెంచండి : ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపు

డెక్సామిథాసోన్ ఉత్పత్తిని పెంచండి : ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపు

కరోనా రోగుల పాలిట సంజీవనిగా మారి వారికి స్వస్థత చేకూరుస్తున్న స్టెరాయిడ్ “డెక్సామిథాసోన్” ఉత్పత్తిని పెంచాలని ప్రపంచ ఆరోగ్య సంస్ధ (WHO) ఔషధ తయారీ సంస్ధలకు పిలుపునిచ్చింది. తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న కరోనా రోగులు డెక్సా మెథాసోన్ వాడటం వల్ల మరణాల రేటు తగ్గుతోందని WHO  తెలిపింది.

డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ మాట్లాడుతూ ‘బ్రిటీష్‌ ట్రయల్‌లో ఈ ఔషధం మంచి ఫలితాన్ని ఇచ్చినట్లు నిరూపితం కావడంతో డెక్సామిథాసోన్‌కు ఇప్పటికే డిమాండ్ బాగా పెరిగిందన్నారు. ఉత్పత్తిని వేగవంతం చేయాలి’ అని ఆయన సూచించారు. గత వారం ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ బృందం నేతృత్వంలోని పరిశోధకులు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న 2 వేల మంది రోగులకు ఈ ఔషధాన్ని ఇచ్చారు. ఇది మరణాల సంఖ్యను 35 శాతం తగ్గించినట్లు తెలిసింది.

పరిశోధనలు ఇంకా ప్రాధమిక దశలోనే  ఉన్నప్పటికీ.. డెక్సమిథాసోన్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న కరోనా రోగుల ప్రాణాలను రక్షించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నదని నిరూపితమైనది. అందుకే ఈ ఔషధం వాడటానికి అనుమతిస్తున్నాం’ అని జెనీవాలో జరిగిన ఒక సదస్సులో టెడ్రోస్‌  చెప్పారు. అంతేకాక ‘ఇప్పుడు మన ముందున్న సవాళ్లు ఏమిటంటే ఈ ఔషధ ఉత్పత్తిని పెంచడం.. ప్రపంచవ్యాప్తంగా వేగంగా.. దీని అవసరమున్న దేశాలకు సమానంగా పంపిణీ చేయడం.. ఎక్కువ అవసరమైన చోట దృష్టి సారించడం’ అని పేర్కొన్నారు.

డెక్సామిథాసోన్ 60 సంవత్సరాలుగా మార్కెట్లో ఉంది. సాధారణంగా ఈ ఔషధం మంటను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అయితే ప్రస్తుతం కరోనాతో తీవ్రమైన అనారోగ్యానికి గురైన రోగులకు మాత్రమే డెక్సామిథాసోన్ వాడాలని WHO వివరించింది. అంతేకాక తేలికపాటి కరోనా లక్షణాలు ఉన్న రోగులకు లేదా కోవిడ్-19‌ నివారణ కోసం ఈ  ఔషధం పనిచేస్తుందనడానికి ఎటువంటి ఆధారం లేదు. హాని కలిగించే ప్రమాదం కూడా ఉంది అని టెడ్రోస్ హెచ్చరించారు.