Lalu Prasad Yadav : లాలూ ప్రసాద్ యాదవ్ కు మళ్లీ అస్వస్థత..ఢిల్లీ ఎయిమ్స్ లో అత్యవసర చికిత్స
బీహార్ మాజీ CM..ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం మళ్లీ క్షీణించింది.దీంతో ఆయన్ని మరోసారి ఢిల్లీలోని ఎయిమ్స్ కు తరలించారు.ఎమర్జన్సీ వార్డులో చికిత్సనందిస్తున్నారు.
Lalu Prasad Yadav : బీహార్ మాజీ CM..ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం మళ్లీ క్షీణించింది. బుధవారం (మార్చి 23,2022) తెల్లవారు జామున లాలూ ఆరోగ్యం కుదుటపడటంతో ఎయిమ్స్ (AIIMS) నుంచి డిశ్చార్జ్ చేశారు. అయితే మళ్లీ ఒక్క సారిగా ఆరోగ్యం క్షీణించడంతో మళ్లీ ఢిల్లీకి తీసుకెళ్లారు. అక్కడ ఎమర్జెన్సీ వార్డు లో జాయిన్ చేశారు.
మంగళవారం (మార్చి 22,2022)మధ్యాహ్నం వరకు రాంచీ లోని రిమ్స్ (RIMS) లో 73 ఏళ్ల లాలూ ప్రసాద్ యాదవ్ చికిత్స పొందారు. ఈక్రమంలో సాయంత్రం హఠాత్తుగా ఆయన ఆరోగ్యం విషమించడంతో డాక్టర్లు ఢిల్లీలోని ఎయిమ్స్ కు తరలించాలని సూచించారు. దీంతో ఆయనను ఎయిమ్స్కు తీసుకెళ్లారు. అక్కడ దాదాపు ఢిల్లీ ఆసుపత్రిలోని అత్యవసర విభాగంలో రాత్రి అంతా అబ్జర్వేషన్ లోనే ఉంచారు. దీంతో ఆయన ఆరోగ్యం కొంత మెరుగుపడటంతో బుధవారం తెల్లవారు జామున డిశ్చార్జ్ చేశారు. దీంతో ప్రత్యేక విమానంలో రాంచీలోని రిమ్స్ కు తిరిగి వెళ్తున్న లాలూ ఆరోగ్య పరిస్థితి మరోసారి విషమించడంతో తిరిగి ఢిల్లీకి తరలించారు. ప్రస్తుతం ఆయన ఎమర్జన్సీ వార్డులో చికిత్స పొందుతున్నారు.
బీహార్ దాణా కుంభకోణంలో, డోరండా ట్రెజరీ నుండి 139 కోట్ల రూపాయలు అపహరించినట్లుగా ఉన్న కేసులో లాలూ ప్రసాద్ యాదవ్ కు ఇటీవలే ఐదేళ్ల జైలు శిక్షవిధించింది. సీబీఐ ప్రత్యేక కోర్టు. కోట్లాది రూపాయల దాణా కుంభకోణంతో పాటు డోరాండా ట్రెజరీ అపహరణ కేసులో దోషిగా తేలిన తరువాత ఆయనను బిర్సా ముండా సెంట్రల్ జైలులో ఉంచారు. జైలులో ఉండగా లాలూ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో రిమ్స్కు తరలించారు. ఈ క్రమంలో 2021 జనవరిలో ఢిల్లీలోని ఎయిమ్స్లో కూడా చేరి చికిత్స పొందారు. దాణా కుంభకోణంలో నాలుగు కేసుల్లో లాలూ ప్రమేయం ఉన్నందున గతంలో ప్రసాద్కు 14 ఏళ్ల జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే.