Congress : ఆర్ధిక ఇబ్బందుల్లో కాంగ్రెస్ .. ప్రతీ ఎంపీ పార్టీకి విరాళం ఇవ్వాలి
కాంగ్రెస్ పార్టీకి విరాళాలు తగ్గిపోయాయి. దీంతో ప్రతి ఎంపీ ఏడాదికి 50,000 విరాళం ఇవ్వాలని కోరింది. ఖర్చులు తగ్గించుకోవాలని సూచించింది.
Congress : విరాళాల తగ్గిపోవడంతో కాంగ్రెస్ పార్టీకి ఆర్ధిక ఇబ్బందులు మొదలయ్యాయి. క్రమంగా రాష్ట్రాల్లో అధికారం కోల్పోతుండటంతో, పార్లమెంట్ లో కూడా ఆశించిన స్థాయిలో ఎంపీలు లేకపోవడంతో ఆ పార్టీకి విరాళాలు ఇచ్చే వారి సంఖ్య భారీగా తగ్గింది. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్త నిబంధనలు తీసుకొచ్చింది ఆ పార్టీ. ఖర్చులు తగ్గించుకునేందుకు పార్టీ నేతలకు సూచనలు చేసింది. కొందరు ఎంపీలు పార్టీ ప్రధాన కార్యదర్శులుగా ఉన్నారు.
వారికి ప్రభుత్వం నుంచి లభించే విమాన సౌకర్యాలను ఉపయోగించుకోవాలని సూచించింది. ఇకపై కార్యదర్శులుగా ఉన్నవారికి 14,000 కి.మీ లోపు రైలులోనే ప్రయాణించాల్సి ఉంటుందని తెలిపారు. 14,000 కిలోమీటర్లు దాటితే తక్కువ శ్రేణి విమాన చార్జీలు చెల్లిస్తామని వెల్లడించారు. ఇక్కడ కూడా ఓ షరతు విధించారు. విమాన చార్జీలు రైలు చార్జికంటే తక్కువ ఉంటేనే ఇస్తామని తెలిపారు. ఇక ప్రతి ఎంపీ ఏడాదికి రూ.50,000 విరాళం ఇవ్వాలని అంతే కాకుండా కనీసం ఇద్దరు కార్యకర్తల నుంచి రూ. 4,000 విరాళం సేకరించాలని సూచించింది.
కాగా ఇటీవల కాంగ్రెస్ పార్టీకి విరాళాలు బాగా తగ్గాయి. 2018-19లో రూ.383 కోట్ల మేర ఎన్నికల బాండ్లు రాగా.. 2019-20లో 318 కోట్లు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీ నేతలకు ఈ సూచన చేసింది. మరోవైపు ప్రధాన కార్యదర్శకి ఇచ్చే రూ.15,000 కార్యదర్శకి ఇచ్చే రూ.12,000 భృతిలో కోతలు విధించారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇలా ఉంటే బీజేపీ విరాళాలు ఏడాదిలో రూ.1,450కోట్ల నుంచి రూ.2,555 కోట్లకు పెరిగాయి.