ఛీ..ఛీ.. మనుషులేనా, దేశ రాజధానిలో దారుణం, మామిడి పండ్లు ఎత్తుకెళ్లిన జనం

దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున దారుణం చోటు చేసుకుంది. మానవత్వం మంట కలిసిపోయింది. మనిషిగా

  • Published By: naveen ,Published On : May 22, 2020 / 12:32 PM IST
ఛీ..ఛీ.. మనుషులేనా, దేశ రాజధానిలో దారుణం, మామిడి పండ్లు ఎత్తుకెళ్లిన జనం

దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున దారుణం చోటు చేసుకుంది. మానవత్వం మంట కలిసిపోయింది. మనిషిగా

దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున దారుణం చోటు చేసుకుంది. మానవత్వం మంట కలిసిపోయింది. మనిషిగా ఎందుకు పుట్టామా అని సిగ్గుతో తలదించుకునేలా జనం ప్రవర్తించారు. మామిడి పండ్లు అమ్ముకునే చిరు వ్యాపారిని జనం నిలువు దోపిడీ చేశారు. అతడి దగ్గర నుంచి మామిడి పండ్లు ఎత్తుకెళ్లారు. మామిడి పండ్లు అమ్ముకునే వ్యక్తి ఆదమరిచి ఉన్న సమయం చూసి జనం ఒక్కసారిగా ఎగబడ్డారు. దొరికిన కాడికి వాటిని దోచుకెళ్లిపోయారు. దాదాపు రూ. 30 వేల విలువైన మామిడి పండ్లు దోచుకుపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

రూ.30వేలతో మామిడి పండ్లు కొనుగోలు:
ఛోటే అనే వ్యక్తి ఢిల్లీలోని జగత్‌పురి ప్రాంతంలో తోపుడు బండిపై పండ్లు అమ్ముతుంటాడు. లాక్‌డౌన్‌తో అతడి వ్యాపారం పూర్తిగా దెబ్బతింది. లాక్‌డౌన్ 4వ దశలో సడలింపులు ఇవ్వడంతో ఇప్పుడిప్పుడే కాస్త గిరాకీ వస్తోంది. దీంతో రూ.30 వేల విలువైన సీజనల్ మామిడి పండ్లను మార్కెట్ నుంచి కొనుగోలు చేసి జగత్‌పురి ప్రాంతంలోని ఓ స్కూల్ దగ్గర విక్రయించడానికి తీసుకొచ్చాడు.

వేరే వ్యక్తితో గొడవ పడుతున్న సమయంలో మామిడి పండ్లు దోచుకెళ్లిన జనం:
కాగా, అదే సమయంలో పక్కనే ఉన్న ఓ దుకాణదారుడితో ఛోటేకు గొడవ జరిగింది. అతడికి సంబంధించిన నలుగురు వ్యక్తులు వచ్చి ఛోటేతో ఘర్షణకు దిగారు. వాళ్లు అలా గొడవ పడుతుండగా.. అటువైపుగా రోడ్డు మీద వెళ్తున్న ఓ వ్యక్తి ఇదే అదనుగా ఛోటే బండిపై ఉన్న మామిడి పండ్లను అందినకాడికి తీసుకెళ్లాడు. అతడిని చూసి ఇతరులు కూడా ఛోటే బండిపైకి ఎగబడ్డారు. చూస్తుండగానే ఛోటే పండ్ల బండి మొత్తం ఖాళీ అయ్యింది. దారెంట వెళ్తున్నవారు తమ వాహనాలు ఆపి అందినకాడికీ దోచుకెళ్లారు. దీంతో అక్కడ చిన్నపాటి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కొంతమంది మామిడి పండ్లను హెల్మెట్లలో పెట్టుకొని మరీ వెళ్లారు. ఛోటే తేరుకునే సరికి బండి మొత్తం ఖాళీ అయ్యింది. ఖాళీ బండి చూసి అతడు లబోదిబోమంటున్నాడు.

జనం తీరుతో కంటతడి పెట్టిన చిరు వ్యాపారి:
రూ.30 వేలు పెట్టి 15 పెట్టెల మామిడి పండ్లను కొనుగోలు చేశానని.. మొత్తం దోచుకెళ్లారని ఛోటే ఆవేదన వ్యక్తం చేశాడు. లాక్‌డౌన్‌తో 55 రోజులుగా కుదేలైన తనకు ఇది పెద్ద ఎదురుదెబ్బ అని వాపోయాడు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశానని.. వారి నుంచి సరైన స్పందన రాలేదని కన్నీరు పెట్టుకున్నాడు. జనం ఇలా చేస్తారని అనుకోలేదని వాపోయాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. 

ఇదంతా లాక్ డౌన్ ఎఫెక్టేనా?
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. జనం తీరు చూసి అంతా సిగ్గుపడుతున్నారు. ఛీ..ఛీ.. మీరసలు మనుషులేనా అని చీదరించుకుంటున్నారు. మరీ ఇంతకు దిగజారారా, మీ కక్కుర్తి తగలెయ్యా అని తిట్టిపోస్తున్నారు. మానవత్వం చూపకపోయినా పర్లేదు ఇలాంటి నీచమైన పనులు చేయకుంటే చాలని అంటున్నారు. చిరు వ్యాపారిని దోచుకున్న మీరు ఏం బాగుపడతారని శాపనార్థాలు పెడుతున్నారు కొందరు నెటిజన్లు. కాగా, కరోనా వైరస్ కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌తో దాదాపు రెండు నెలలుగా జనాలకు పనులు లేకుండా పోయాయి. దీంతో డబ్బులు కూడా లేవు. మరోవైపు మామిడి పండ్ల రేటు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ క్రమంలో జనాలు దిగజారిపోయి ఇదిగో ఇలా అందినకాడికి మామిడి పండ్లను ఎత్తుకెళ్లారు. లాక్ డౌన్ కారణంగా దొంగతనాలు దోపిడీలు పెరుగుతాయేమో అని సమాజంలో చాలా మంది ఆందోళన చెందుతున్నారు. వాటిని నిజం చేసేలా ఉందీ సంఘటన.