Heavy Rain : హైదరాబాద్‌ లో భారీ వర్షం… 23 సె.మీ వర్షపాతం నమోదు

హైదరాబాద్‌ను వరుణుడు వదలడం లేదు. రెండోరోజూ నగరంలో కుండపోత కురిపించాడు. నిన్న ఏకధాటిగా కురిసిన వర్షానికి హైదరాబాద్‌ ఆగమాగం అయ్యింది. భారీ వర్షానికి రోడ్లన్నీ చెరువులను తలపించాయి.

Heavy Rain : హైదరాబాద్‌ లో భారీ వర్షం… 23 సె.మీ వర్షపాతం నమోదు

Hyd

Heavy rain in Hyderabad : హైదరాబాద్‌ను వరుణుడు వదలడం లేదు. రెండోరోజూ నగరంలో కుండపోత కురిపించాడు. నిన్న ఏకధాటిగా కురిసిన వర్షానికి హైదరాబాద్‌ ఆగమాగం అయ్యింది. భారీ వర్షానికి రోడ్లన్నీ చెరువులను తలపించాయి. దీంతో జనం ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. పలు ప్రాంతాల్లో సాయంత్రం నుంచే విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. చాలా కాలనీలు చీకట్లోనే ఉండాల్సి వచ్చింది. వరదతో చెరువులు, నాలాలు ఉప్పొంగాయి. డ్రైనేజీలు పొంగిపొర్లాయి. పలు కాలనీలు నీట మునిగాయి. రోడ్లపై భారీగా నీరు చేరడంతో కిలోమీటర్ల పొడవునా ట్రాఫిక్‌ స్తంభించిపోయింది.

హైదరాబాద్‌లో కురిసిన వర్షానికి రోడ్లపై గుంతలు ఏర్పడ్డాయి. పలు ప్రాంతాల్లో ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జిల పనులు జరుగుతున్నాయి. నిర్మాణాల కోసం ఆయా చోట్ల రహదారులను తవ్వడంతో గుంతలు పడ్డాయి. వాటిలో వాననీళ్లు నిండటంతో వాహనదారులు భయం భయంగా ప్రయాణించాల్సి వచ్చింది. ఇవాళ, రేపు కూడా హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ కేంద్రం హెచ్చరికలతో జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటు చేశారు. ప్రధాన కార్యాలయంలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు.

Heavy Rains in Hyderabad: ఇంకా ముంపులోనే హైదరాబాద్ లోతట్టు ప్రాంతాలు

శుక్రవారం రాత్రి నుంచి శనివారం రాత్రి వరకు 23 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. శుక్రవారం రాత్రి రెండున్నర గంటల వ్యవధిలోనే 13.5 సెంటీమీటర్ల వర్షం కురవగా.. శనివారం ఒక్క గంట వ్యవధిలోనే 9.5 సెం. మీ. వర్షం కురిసింది. శుక్రవారం అర్ధరాత్రి వర్షానికి ఇబ్బందులు పడిన లోతట్టు ప్రాంతాలు, పలు కాలనీలు.. శనివారం కురిసిన భారీ వర్షాలతో మళ్లీ కష్టాలను ఎదుర్కొన్నాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ యంత్రాంగంతోపాటు పోలీసు శాఖ అప్రమత్తమై.. ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టింది.

మూసీకి వరద నీరు పోటెత్తుతోంది. ఉస్మాన్‌సాగర్‌ నాలుగు గేట్లను ఎత్తి 1600 క్యూసెక్కులు, హిమాయత్‌సాగర్ ఆరుగేట్లను ఎత్తి 5,600 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. తెలంగాణలో శనివారం పలుచోట్ల  పిడుగులు పడి ఐదుగురు మృతి చెందారు. ఒక్క ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోనే నలుగురు మృతి చెందగా, హనుమకొండ జిల్లాలో ఒకరు మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. పలుచోట్ల పిడుగులు పడి పశువులు మృతి చెందాయి. మరోవైపు ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో భారీ వర్షం పడింది.

Supreme Court : కరోనా మాత ఆలయం కూల్చివేతపై పిటిషన్ వేసిన వ్యక్తులకు రూ.5 వేలు జరిమానా

రుతుపవనాల తిరోగమన సమయంలో భారీ వర్షాలు నమోదుకావడం సర్వసాధారణం. తక్కువ సమయంలో కుంభవృష్టితో నాలాలు, చెరువులు పొంగి… రహదారులు, కాలనీల్లోకి వరద నీరు వస్తోంది. నగరంలో ముంపు నివారణకు చేపట్టిన చర్యలతో కేవలం గంట, గంటన్నరలోనే కాలనీల నుంచి వరద నీరు సాఫీగా బయటకు వెళ్లిపోతుంది. కాగా, గత ఏడాది అక్టోబర్‌లోనే వంద సంవత్సరాల్లో అతి రెండో పెద్ద వర్షపాతంగా నగరంలో 30 సెంటీమీటర్ల వాన కురిసిన విషయం తెలిసిందే.

ఉత్తర అండమాన్‌ సముద్రంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. రాగల 28గంటల్లో అల్పపీడనం ఏర్పడి, తర్వాత నాలుగైదు రోజుల్లో మరింత బలపడి.. దక్షిణ ఒడిసా-ఉత్తరకోస్తాంధ్ర తీరాల వైపు ప్రయాణించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రానున్న 2రోజులు రాయలసీమలో కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు, కోస్తా జిల్లాల్లో అనేకచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.