జగన్‌కు చెక్ పెట్టడం బీజేపీకే సాధ్యం

ఏపీ బీజేపీ చీఫ్ సోమువీర్రాజు సీఎం జగన్ పై మండిపడ్డారు.

జగన్‌కు చెక్ పెట్టడం బీజేపీకే సాధ్యం

only bjp can keep check to cm jagan: ఏపీ బీజేపీ చీఫ్ సోమువీర్రాజు సీఎం జగన్ పై మండిపడ్డారు. జగన్ కు చెక్ పెట్టడం ఒక్క మోదీ సర్కార్ కే సాధ్యమన్నారాయన. కడపలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సోమువీర్రాజు, అధికార పార్టీపై విరుచుకుపడ్డారు. రాష్ట్రానికి కేంద్రం ఎంతో చేస్తోందని ఆయన చెప్పారు. మరి నగరాలు, పట్టణాలు, గ్రామాలకు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందో తెలియజేయాలన్నారు. కేంద్రం నిధులతోనే రాష్ట్రంలోని మున్సిపాలిటీలు అభివృద్ధి చెందాయని సోమువీర్రాజు స్పష్టం చేశారు. ఈ విషయంపై టీడీపీ వైసీపీతో సవాల్ కు సిద్ధమని ఆయన ప్రకటించారు.

మున్సిపల్ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. అన్ని పార్టీల్లోని అగ్రనాయకులు ప్రచార పర్వంలోకి దిగారు. జనాల్లోకి వెళ్లి ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో అధికార పార్టీ లక్ష్యంగా ప్రతిపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. తమ పార్టీని గెలిస్తే రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తామంటున్నాయి.

శనివారం(మార్చి 6,2021) విశాఖలోని పాత గాజువాకలో చంద్రబాబు మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పల్లా శ్రీనివాస్ అమరణ నిరాహార దీక్ష చేసి స్టీల్ ఫ్లాంట్ ఉద్యమానికి ఊపిరి పోశారని కొనియాడారు. ప్రశ్నించే వారిపై ఈ ప్రభుత్వం కేసులు పెడతోందని ఆరోపించారు. వైసీపీ నేతల బట్టలు విప్పించే రోజు తొందర్లోనే వస్తుందన్నారు. చెత్త, పనికిమాలిన సర్కార్ రాష్ట్రాన్ని పాలిస్తోందని, ఇలాంటి ప్రభుత్వం అవసరమా? అని చంద్రబాబు ప్రశ్నించారు. పన్నులు పేరుతో ప్రజలు సొమ్మును దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు.

టీడీపీ ప్రభుత్వ హయాంలో విశాఖ శోభను పెంచామని చంద్రబాబు అన్నారు. స్టీల్ ఫ్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కలిసి పోరాడదాం అని తాను చెబితే, ఇప్పటి వరకు సీఎం జగన్ స్పందించ లేదని చంద్రబాబు అన్నారు.