Gujarat Election : కాంగ్రెస్తో పీకే ? మోదీ ఇలాఖాలో గాంధీ పార్టీని నిలబెడుతారా ?
మోదీ, అమిత్ షాల కంటే తానే తెలివైన వ్యూహకర్తను అని నిరూపించుకునే క్రమంలో గుజరాత్లో కాంగ్రెస్ విజయాన్ని సవాల్గా తీసుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు...
Prashant Kishor Work With Congress : పొలిటికల్ స్ట్రాటజిస్టు ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్తో చేయి కలుపుతున్నారా..? మోదీ ఇలాఖాలో గాంధీల పార్టీని నిలబెట్టి.. దేశవ్యాప్తంగా పునరుజ్జీవం తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారా..? హస్తం పార్టీకి గత వైభవాన్ని తీసుకొచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారా..? ఇప్పుడిదే జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. పీకే కాంగ్రెస్ను మళ్లీ బలంగా మార్చేందుకు రంగంలోకి దిగనున్నారనేది చర్చనీయాంశంగా మారింది. గుజరాత్లో బీజేపీని ఓడించడానికి ప్రశాంత్ కిషోర్ సేవలను తీసుకునే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీతో ఆయన చర్చలు జరిపినట్లుగా సమాచారం. గుజరాత్లో అధికారం కాంగ్రెస్ పార్టీకి దశాబ్దాలుగా అందని ద్రాక్షగా ఉంది. అక్కడ నరేంద్రమోదీనే ఇప్పటికీ చక్రం తిప్పుతున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ నుంచి ఇటీవలే కొత్త నాయకత్వం పురుడు పోసుకుంటోంది. అక్కడ హార్దిక్ పటేల్లాంటి వారు కలవడంతో కాంగ్రెస్కు కొత్త శక్తి వచ్చింది. అయితే ఇక్కడ గెలుపు సాధ్యమేనా అనేది సందేహమే.. అయితే ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత, పోస్టుమార్టమ్ మొదలుపెట్టిన హస్తం పార్టీ.. గుజరాత్పైనే ఎక్కువగా ఫోకస్ చేసినట్టు పొలిటికల్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
Read More : Story of Narendra Modi: ఇది మోదీ స్టోరీ: నరేంద్ర మోదీ జీవితంలోని స్ఫూర్తిదాయకమైన క్షణాలు
ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అట్టర్ ప్లాప్ : –
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ అట్టర్ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. అధికారంలో ఉన్న పంజాబ్ను సైతం పోగొట్టుకుంది.. మిగతా నాలుగు రాష్ట్రాల్లో పోటీలోనే లేనట్టుగా కనిపించింది. ఈ ఎన్నికల తర్వాత మరోసారి కాంగ్రెస్ నాయకత్వంపై విస్తృతమైన చర్చ జరిగింది. అంతర్గతంగా మరోసారి నిరసన గళం పెరిగింది. ఒక సమయంలో సోనియా గాంధీ పార్టీ అధినాయకత్వాన్ని వదిలిపెడతారనే ప్రచారం కూడా జరిగింది. చివరికి అంతా సద్దుమణిగి.. మళ్లీ మేడమే కంటిన్యూ అయ్యారు. అయితే ఈ పరాజయంపై పోస్టుమార్టమ్ చేసిన హస్తం నేతలు.. భవిష్యత్తు కోసం బలమైన వ్యూహకర్తలు కావాలని భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా కనుమరుగవుతున్న పార్టీని కాపాడుకునేందుకు పొలిటికల్ స్ట్రాటజిస్టుల అవసరాన్ని గుర్తించారు. ఈ ఏడాది చివర్లో జరిగే.. ఎన్నికల్లో సత్తా చాటాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది. అందుకు మోదీ ఇలాఖానే కరెక్టని లెక్కలు గడుతున్నారు.
Read More : Pending Cases : దేశంలో 4.70కోట్ల కేసులు పెండింగ్ : కేంద్రం
గుజరాత్ మోదీ అడ్డా : –
గుజరాత్ మోదీ అడ్డా. అక్కడ జెండా పాతితే.. మోదీ మేనియాను అడ్డుకోవచ్చని భావిస్తోంది కాంగ్రెస్. అదే సమయంలో అట్టడుగుకు పడిపోయిన కాంగ్రెస్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరుగుతుందని లెక్కలు కడుతోంది. అందుకే ఈ ఏడాది చివర్లో జరగనున్న గుజరాత్ ఎన్నికలపై దృష్టిసారించింది. అయితే ఇక్కడ గెలవడం అంత సులువైన పనేం కాదు. అందుకే పీకే వ్యూహాలతో ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్టు సమాచారం. గతంలో మమత బెనర్జీ తరఫున పనిచేసిన తర్వాత… ఇక పొలిటికల్ ఎనలిస్టుగా ఉండనంటూ ప్రకటించారు ప్రశాంత్ కిశోర్. ఆ సమయంలో ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ కండువా కప్పుకుంటారంటూ ప్రచారం జరిగింది. అయితే తాను ఏ పార్టీలో చేరను అని ప్రకటించిన పీకే.. కొద్ది రోజుల తర్వాత కాంగ్రెస్పై వరుసగా విమర్శలు చేశారు. రాహుల్గాంధీపై నేరుగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇప్పుడు వారితోనే కలిసి పనిచేయాలనే ఆలోచన ఎంతవరకు వర్కవుట్ అవుతుందనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తిని కలిగిస్తోంది.
Read More : Uddhav Thackeray : దమ్ముంటే నన్ను జైల్లో పెట్టండి : ఉద్ధవ్ ఠాక్రే
కాంబో పని చేస్తుందా ? :-
ఇప్పటికే కాంగ్రెస్ తరఫున పీకే గత సహచరుడు సునీల్ కనుగోలు రంగంలోకి దిగారు. పీకే, సునీల్ కనుగోలు.. ఇద్దరూ బీజేపీ అధికారంలోకి రావడానికి కృషిచేశారు. ఆ తర్వాత వేర్వేరు దారుల్లో పని చేసుకుంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ తరఫునే పనిచేస్తున్న సునీల్కు.. మళ్లీ పీకే తోడైతే కాంగ్రెస్ మంచి ఫలితాలు సాధిస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. దీనికి సునీల్ కూడా అంగీకారం తెలిపిసట్టు సమాచారం. గుజరాత్లో పనిచేయడాన్ని ప్రశాంత్ కిషోర్ కూడా చాలెంజింగ్గా తీసుకునే అవకాశం ఉంది. ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినా… తనదైన ముద్ర వేయాలనుకుంటున్నారు పీకే. మోదీ, అమిత్ షాల కంటే తానే తెలివైన వ్యూహకర్తను అని నిరూపించుకునే క్రమంలో గుజరాత్లో కాంగ్రెస్ విజయాన్ని సవాల్గా తీసుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మోదీ వ్యతిరేక శక్తుల కోసం పనిచేస్తున్న పీకే.. కాంగ్రెస్కు చేయందిస్తారని అనుకుంటున్నారు. అయితే కాంగ్రెస్, పీకే చేతులు కలుపుతారా..? వీరి కాంబో ఎలా పనిచేస్తుంది..? ఎంత వరకు సక్సెస్ అవుతుందనేది ఆసక్తిని కలిగిస్తోంది.