Uddhav Thackeray : దమ్ముంటే నన్ను జైల్లో పెట్టండి : ఉద్ధవ్ ఠాక్రే
ఇన్ని రోజులు రామ మందిరం పేరుతో.. ఇప్పుడు దావుద్ పేరుతో బీజేపీ ఓట్ల వేటకు సిద్ధపడుతోందంటూ అసహనం వ్యక్తం చేశారు.
Uddhav Thackeray : తమ పార్టీ నేతల విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు అనుసరిస్తున్న తీరుపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే మండిపడ్డారు. బీజేపీపై అసెంబ్లీ వేదికగా ఉద్ధవ్ ఠాక్రే తీవ్రంగా విరుచుకుపడ్డారు. ముఖ్యంగా మనీ లాండరింగ్ కేసులో తన బావమరిది ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ స్తంభింపజేయడం తనను లక్ష్యంగా చేసుకోవడమేనన్నారు.
ఈ సందర్భంగా అధికారంలోకి వచ్చేందుకు మమ్మల్ని జైల్లో పెట్టాలి అనుకుంటే.. ముందు తనను జైల్లో పెట్టండంటూ బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర భాగస్వామ్య పక్షాల నేతలు, వారి సన్నిహితులపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో దాడులు చేయించడాన్ని తప్పుబట్టారు.
Uddhav Thackeray: మహారాష్ట్రలో ప్రతి గ్రామంలో బీజేపీని అడ్డుకోవాలి: సేనలకు ఉద్ధవ్ పిలుపు
ఇన్ని రోజులు రామ మందిరం పేరుతో.. ఇప్పుడు దావుద్ పేరుతో బీజేపీ ఓట్ల వేటకు సిద్ధపడుతోందంటూ అసహనం వ్యక్తం చేశారు. మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన మంత్రి నవాబ్ మాలిక్ రాజీనామాను బీజేపీ డిమాండ్ చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. అసలు బీజేపీ జమ్మూ కశ్మీర్లో మెహబూబా ముఫ్తీతో ఎందుకు పొత్తు పెట్టుకుందో చెప్పాలంటూ సూటిగా ప్రశ్నించారు.
అసలు దావూద్ ఎక్కడుంటాడు? ఎవరికైనా తెలుసా అంటూ ఉద్ధవ్ ప్రశ్నించారు. బీజేపీకి నిజంగా దమ్ముంటే దావూద్ను చంపేయాలని.. అంత దమ్ము బీజేపీకి ఉందా అని ఉద్ధవ్ ప్రశ్నించారు. మంత్రి నవాబ్ మాలిక్కు దావూద్తో సంబంధాలుంటే.. ఇన్నేళ్లుగా కేంద్ర దర్యాప్తు బృందాలు ఏం చేశాయని ఉద్ధవ్ ఠాక్రే ప్రశ్నించారు.