Sonu Sood : వారికి ఇచ్చే నష్టపరిహారం అయిపోయిన తర్వాత? ఒడిశా ప్రమాదంపై సోనూసూద్ సంచలన ట్వీట్..
తాజాగా ఒడిశా ప్రమాదంపై స్పందిస్తూ ఓ వీడియో చేసి ఆ వీడియోని తన ట్విట్టర్ లో షేర్ చేశాడు. ఈ ప్రమాదంపై సోనూసూద్ సంచలన ట్వీట్ చేశాడు.
Odisha Train Accident : ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో శుక్రవారం సాయంత్రం జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ఇప్పటికే 280కి పైగా మృతి చెందినట్లు, వెయ్యి మందికి పైగా గాయపడినట్లు సమాచారం. ఇంకా మృతులు, క్షతగాత్రులు పెరగనున్నట్లు తెలుస్తోంది. ఒకేసారి మూడు రైళ్లు ఢీకొనడంతో ప్రమాద స్థాయి ఎక్కువగా ఉంది. ఈ రైలు ప్రమాదంపై రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. పలువురు వారికి సహాయం చేయడానికి ముందుకొస్తున్నారు. పలువురు ప్రముఖులు ఈ ప్రమాదంలో బాధితులకు సహాయం చేయమని కోరుతున్నారు.
అయితే ఈ ప్రమాదంపై సోనూసూద్ సంచలన ట్వీట్ చేశాడు. కరోనా సమయంలో తన సేవా కార్యక్రమాలతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు నటుడు సోనూసూద్. కరోనా తర్వాత కూడా తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నాడు. తాజాగా ఒడిశా ప్రమాదంపై స్పందిస్తూ ఓ వీడియో చేసి ఆ వీడియోని తన ట్విట్టర్ లో షేర్ చేశాడు.
సోను సూద్ ఆ వీడియోలో మాట్లాడుతూ.. మనం ఈ రోజు ప్రమాదం గురించి తెలుసుకొని ట్వీట్ చేస్తాం. నష్టపోయిన వారిపట్ల సానుభూతి చూపిస్తాం. కానీ వెంటనే మన పనుల్లో మనం బిజీ అయిపోతాం. ఆ తర్వాత వాళ్ళని ఎవరూ పట్టించుకోరు. కానీ వీరిలో జీవనోపాధి కోల్పోయిన వారి పరిస్థితి ఏంటి? వారి కుటుంబాల పరిస్థితి ఏంటి? ఈ ప్రమాదం వల్ల చాలా కుటుంబాలు నష్టపోయాయి. ఆ కుటుంబాలు మళ్ళీ నిలబడతాయా? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన నష్టపరిహారం రెండు మూడు నెలల్లో అయిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ వారి పరిస్థితి ఏంటి? ఈ ప్రమాదంలో తమ కుటుంబాన్ని పోషించే వారి కాళ్ళు, చేతులు తెగిపోయాయి. ప్రభుత్వాలు ఇచ్చే నష్టపరిహారంతో వారికి న్యాయం జరుగుతుందా? ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ప్రభుత్వాలు ఏదో నష్ట పరిహారం చెల్లించి వదిలేయకుండా వారికి పెన్షన్స్ కానీ, స్థిరాదాయం కల్పించడం కానీ చేయాలి. అలా చేస్తేనే వారికి భరోసా ఇచ్చిన వాళ్ళం అవుతామని నా అభిప్రాయం అని అన్నారు.
సోనూసూద్ ఈ వీడియోని షేర్ చేస్తూ.. ఒడిశాలో జరిగిన విషాదం గురించి తెలియగానే నా గుండె ముక్కలైంది. ప్రమాద బాధితులకు సానుభూతి తెలుపుతున్నాను. మనందరం వారి కుటుంబాలకు అండగా ఉండాలని కోరుకుంటున్నాను అంటూ పోస్ట్ చేశారు. దీంతో సోనూసూద్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.
Heartbroken by the news of the train tragedy in Odisha. Heartfelt deepest condolences 💔🙏
Time to show our support and solidarity for the unfortunates. 💔#OdishaTrainAccident 🇮🇳 pic.twitter.com/ZfuYYp8HK9— sonu sood (@SonuSood) June 3, 2023