అనుమానాన్ని సాక్ష్యంగా తీసుకోలేం : సుప్రీంకోర్టు
sc suspicion cannot take place proof : అనుమానం..అది ఎంత బలమైనా..దానిని సాక్ష్యంగా తీసుకోలేమని దాన్ని సాక్ష్యం స్థానంలో అనుమతించలేమని సుప్రీంకోర్టు ఓ కేసు విషయంలో స్పష్టం చేసింది. సహేతుకమైన కారణంతో దోషిగా నిరూపించలేకపోతే నిందితుడిని నిర్దోషిగానే భావించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది.
ఒక చర్యకు..ఒక ఘటనకు సదరు నిందితులే కారణమని నిరూపించడానికి..దానికి దారితీసిన ఘటనలను సాక్ష్యాలతోపాటు చూపాలని..వాటిని రుజువు చేయాలని జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ హేమంత్ గుప్తాలతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది.
ఓ హోంగార్డును కరెంటు షాకిచ్చి చంపేశారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు వ్యక్తుల విషయంలో కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. వారిని దోషులుగా చూడలేమని..వారికి ఆరోపణల నుంచి కేసు నుంచి విముక్తి కల్పిస్తూ ఒరిస్సా హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు సమర్థించింది. ఈ సందర్భంగా దేశ అత్యున్నత ధర్మాసనం అయిన సుప్రీం కోర్టు అనుమానం ఎంత బలంగా ఉన్నా దాన్ని రుజువుగా తీసుకోలేమని వ్యాఖ్యానించింది.
ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న నిందితుడు వనవిహారి మహాపాత్ర అనే వ్యక్తి అతని కుమారుడు లుజా, మరికొందరితో కలిసి.. తన భర్త విజయ్కుమార్కు విషమిచ్చి.. కరెంటు షాక్తో చంపేశారంటూ గీతాంజలి అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గీతాంజలి, ఆమె భర్త విజయ్ కుమార్ చందాబాలి పోలీస్ ఠాణాలో పనిచేస్తున్నారు. పోస్టుమార్టం నివేదికలో ఎలక్ట్రిక్ షాక్తోనే విజయ్కుమార్ చనిపోయినట్లు తేలింది. ఇది హత్యే అనేందుకు ఎలాంటి ఆధారాలు కూడా దొరకలేదు.
నిందితులకు చెందిన ఒక గదిలో తన భర్త విగతజీవుడిగా పడి ఉన్నాడనీ, ఇది హత్యేనని గీతాంజలి ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలకు బలమిచ్చేలా అంతకుముందు ఎలాంటి సంఘటనలు చోటుచేసుకోలేదని పేర్కొంటూ ఒరిస్సా హైకోర్టు నిందితులకు విముక్తి కల్పించింది. ఈ కేసు సుప్రీంకోర్టుకు రావటంతో ఒరిస్సా హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు సమర్థించింది.