AGRICULTURE : దుక్కులు దున్నేందుకు ఇదే సరైన కాలం!

వేసవిలో దుక్కుల వల్ల భూమిలో ఉన్న ఛీడపీడలు, కోశస్త, గుడ్డు దశలు బయటపడి అధిక ఉష్ణోగ్రతలకు చనిపోతాయి. పంట చేలను వాలుకు అడ్డంగా లోతుగా దున్నకోవటం వల్ల వర్షపు నీరు భూమిలోకి ఇంకేందుకు అనువుగా ఉంటుంది.

AGRICULTURE : దుక్కులు దున్నేందుకు ఇదే సరైన కాలం!

Plow (1)

AGRICULTURE : వర్షాధారంపై అధారపడి భూములు సాగు చేసే రైతులు రానున్న ఖరీఫ్ కు ఇప్పటి నుండే సన్నధ్ధం కావాల్సిన అవసరం ఉంది. జూన్ మాసంలో రుతుపవనాలు వచ్చి వర్షాలు పడటం మొదలైన తరువాత నేలను సిద్ధం చేసుకునే కంటే ముందుస్తుగా నేలను పంటలు వేసుకునేందుకు అనువుగా సిద్ధం చేసుకోవటం మంచిది. మే మాసం భూములను దున్ని ఉంచుకోవటం మంచిది. ఖరీఫ్ పంట కు సిద్ధమౌతున్న వారు పొలాల్లో దుక్కి దున్నటం సకాలంలో పూర్తి చేయటం వల్ల అనేక లాభాలు ఉన్నాయి.

సకాలంలో దుక్కులు దున్నటం వల్ల నేల గుల్లబారటంతోపాటు, మెత్తగా మారుతుంది. ముందుగా సిద్ధం చేసుకోవటం వల్ల జూన్ లో రుతుపవనాల కారణంగా వర్షాలు పడి నీరు భూమిలోకి ఇంకి అన్ని నేలపొరల్లో అన్ని వైపులకు చేరుకుతంది. నేలలో ఎక్కువ నీరు నిలబడుతుంది. మే నెలలలో అడపదడపా వచ్చే గాలి వానల వల్ల వచ్చే వర్షపు నీటిని సద్వినియోగపరుచుకోవాలంటే దుక్కులు దున్ను కోవటం మంచిది. చాలా మంది రైతులు రబీ పంట పూర్తయిన తరువాత తిరిగి వర్షకాలం వచ్చేంత వరకు భూమిని వదిలేస్తుంటారు. ఇలా చేయటం వల్ల భూమి లోపల పొరల నుండి నీరు ఆవిరైపోతుంది. అంతే కాకుండా కలుపు మొక్కలు పెరిగి భూమిలోని నీటిని, పోషక పదార్ధాలను గ్రహించి భూమిలో సారంలేకుండా చేస్తాయి.

వేసవిలో దుక్కులు దున్నటం వల్ల ప్రయోజనాలు ;

వేసవిలో దుక్కుల వల్ల భూమిలో ఉన్న ఛీడపీడలు, కోశస్త, గుడ్డు దశలు బయటపడి అధిక ఉష్ణోగ్రతలకు చనిపోతాయి. పంట చేలను వాలుకు అడ్డంగా లోతుగా దున్నకోవటం వల్ల వర్షపు నీరు భూమిలోకి ఇంకేందుకు అనువుగా ఉంటుంది. భూమి ఎక్కువ తేమను పీల్చుకుని దానిని నిలువ చేసుకునే సామర్ధ్యాన్ని పెంపొందించుకోవచ్చు. నీటి పరివాహక ప్రాంతాలలోని భూములలో వేసవిలో వాలుకు అడ్డంగా దున్నడం వల్ల భూమి కోతను నివారించవచ్చు. భూసారాన్ని కాపాడుకోవచ్చు.

వేసవిలో దుక్కులు చేసే ముందు పశువుల ఎరువు, కంపోస్టుగాని, చెరువు మట్టి వెదజల్లడం వల్ల నేల సారవంతమవుతుంది. వేసవి దుక్కి చేసిన తరువాత వీలైన ప్రాంతాలలో పచ్చి రొట్ట విత్తనాలు చల్లకుంటే భూసారం పెరుగుతుంది. వేసవి దుక్కులు దున్నే ముందుగా పొలంలో ఆవుల మందలు , గొర్రెలు, మేకల మందలను వదలిపెట్టాలి. అవి విసర్తించే మల మూత్రాలు భూమిలోకి చేరటం వల్ల సేంధ్రీయ పదార్ధం పెరుగుతుంది. భూసారం అభివృద్ధి చెందుతుంది. దీని వల్ల పంటల్లో సూక్ష్మ పోషకాలు లోపాలను నివారించవచ్చు.

క్షారత్వం ఎక్కువగా ఉన్న భూములలో నేలలోపలి పొరలు గట్టిపడి మురుగునీరు పోవు సౌకర్యం తగ్గుతుంది. దీనిని నివారణకు నేలలో వరిపొట్టు లేదా వేరుశనగ తొక్కలను వేసి వేసవిలో 30 సెంటీమీటర్ల లోతు దుక్కి చేయటం వల్ల క్షార లక్షణాలు భూమి క్రింది పొరలల్లోకి నెట్టి వేయబడి నేల క్షరత్వం చాలా వరకు తగ్గుతుంది. నేల పై పొరలో గాలిశాతం పెరుగుతుంది. దీని వల్ల సూక్ష్మ జీవుల సంక్య వృద్ధి చెందుతుంది. ఈ సూక్ష్మజీవులు నేలలోని సేంద్రీయ పదార్ధం త్వరగా కుళ్లడానికి దోహదం చేస్తాయి. దుక్కి దున్నడం వల్ల కలుపు విత్తనాలు అధిక ఉష్ణోగ్రతలకు లోనై నశిస్తాయి.