Twitter India Grievance Officer : దిగొచ్చిన ట్విట్టర్..భారత్ లో గ్రీవెన్స్ అధికారిగా వినయ్ ప్రకాశ్ నియామకం
సోషల్ మీడియా దిగ్గజ సంస్థ ట్విటర్ ఎట్టకేలకు దిగొచ్చింది.
Twitter India Grievance Officer సోషల్ మీడియా దిగ్గజ సంస్థ ట్విటర్ ఎట్టకేలకు దిగొచ్చింది. కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన నూతన ఐటీ నిబంధనలు అమలు దిశగా చర్యలు చేపట్టింది. భారత్ కు చెందిన వినయ్ ప్రకాశ్ను ఇండియాలో రెసిడెంట్ గ్రీవెన్స్ అధికారిగా నియమించినట్లు ఆదివారం ట్విట్టర్ ప్రకటించింది. ఈ మేరకు సంస్థ వెబ్సైట్లో ఆయన వివరాలు పొందుపరిచింది. అందులోని ఈమెయిల్ కాంటాక్ట్ ఐడీకి వినియోగదారులు తమ ఫిర్యాదులను పంపించవచ్చని పేర్కొంది.
కాగా, గత కొన్ని రోజులుగా నూతన ఐటీ నిబంధనల అమలు విషయమై కేంద్ర ప్రభుత్వం-ట్విటర్ మధ్య తీవ్ర వివాదం నడుస్తోన్న విషయం తెలిసిందే. మిగతా అన్ని సోషల్ మీడియా సంస్థలు కొత్త ఐటీ నిబంధనలకు అంగీకరించినా.. ట్విటర్ మాత్రం తనకు ఇంకా సమయం కావాలని అడుగుతూ వచ్చింది. చాలా రోజులు వేచి చూసిన కేంద్రం.. ఈ సంస్థకు ఇచ్చే చట్టపరమైన రక్షణను ఎత్తివేసింది. దీంతో ట్విటర్పై దేశ వ్యాప్తంగా చాలా చోట్ల కేసులు నమోదు అయ్యాయి. కోర్టుకు ఆశ్రయించినా కూడా ట్విటర్ కు చుక్కెదురైంది.
ఐటీ నిబంధనలు పాటించడంలో ట్విటర్ విఫలమైందని ఇటీవల ఢిల్లీ హైకోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. ట్విటర్ తీరుపై ఢిల్లీ హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫిర్యాదు అధికారుల నియామకంలో జాప్యం తగదని హెచ్చరించిన కోర్టు.. ఇంకెంత కాలం పడుతుందని ప్రశ్నించింది. దీంతో గ్రీవియన్స్ ఆఫీసర్ను నియమించడానికి 8 వారాల సమయం కావాలని గురువారం ఢిల్లీ హైకోర్టును కోరిన ట్విటర్.. నాలుగు రోజుల్లోనే నియమించడం గమనార్హం. నూతన ఐటీ రూల్స్ ప్రకారం ఈ గ్రీవియన్స్ ఆఫీసర్తోపాటు చీఫ్ కాంప్లయెన్స్ ఆఫసీర్, నోడల్ ఆఫీసర్ను కూడా ట్విట్టర్ నియమించాల్సి ఉంది.
మరోవైపు, మే-26,2021 నుంచి జూన్ 25 వరకు సంబంధించిన తన కాంప్లియెన్స్ రిపోర్టును కూడా ట్విటర్ ఆదివారం పబ్లిష్ చేసింది. కొత్త ఐటీ రూల్స్ ప్రకారం ఈ నివేదికను ప్రచురించడం కూడా తప్పనిసరి. ఈ రిపోర్ట్ ప్రకారం..ఉగ్రవాదం మరియు పిల్లల లైంగిక దాడులు వంటి పలు అభ్యంతకర కంటెంట్ చేస్తుండటం లేదా ప్రమోట్ చేస్తున్నారన్న కారణంగా 22,564 అకౌంట్లను సస్పెండ్ చేసినట్లు ట్విట్టర్ తెలిపింది. ఇది కోర్టు ఆదేశాలతో పాటు పలువురు వ్యక్తులు రిపోర్ట్ చేసిన 133 URL లపై లను కూడా ట్విట్టర్ చర్యలు తీసుకుంది