YS Sharmila: అక్టోబర్ 20 నుంచి వైఎస్ షర్మిల పాదయాత్ర
తెలంగాణ రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా.. రాజన్న రాజ్యం తేవాలనే లక్ష్యంతో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించిన వైఎస్ షర్మిల.. పాదయాత్రకు సిద్ధమైంది.
Ys Sharmila: తెలంగాణ రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా.. రాజన్న రాజ్యం తేవాలనే లక్ష్యంతో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించిన వైఎస్ షర్మిల.. పాదయాత్రకు సిద్ధమయ్యారు. వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల త్వరలోనే ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్ర మొదలుపెట్టనున్నట్లు ప్రకటించారు. ఏడేళ్ల పాలనలో కేసీఆర్, ఆయన కుటుంబం పాలిస్తున్న తీరుతో ప్రజా సమస్యలు తీరలేదని, వారి సమస్యలు తెలుసుకుంటూ.. అధికారంలోకి రాగానే తీర్చేందుకు పాదయాత్ర చేస్తున్నట్లు ప్రకటించారు.3
అక్టోబర్ 20న మొదలయ్యే ఈ పాదయాత్రను వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాదిరిగానే చేవెళ్ల నుంచి ప్రారంభించనున్నారు. జీహెచ్ఎంసీ మినహా అన్ని ఉమ్మడి జిల్లాలను కవర్ చేయబోతున్నట్లు చెప్పిన ఆమె.. 90 నియోజకవర్గాల్లో పాదయాత్ర సాగుతుందని, చేవెళ్లలోనే పాదయాత్ర ముగుస్తుందన్నారు. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసి సంక్షేమ పాలన అందిస్తామన్న నమ్మకాన్ని ప్రజల్లో ఈ పాదయాత్రతో కలిగిస్తామన్నారు వైఎస్ షర్మిల.
ఏడేళ్ళల్లో కేసీఆర్ ప్రతి వర్గాన్ని మోసం చేశారని, కేసీఆర్ సీఎం ఆయిన తర్వాత దళితులపై దాడులు 800శాతం పెరిగాయని అన్నారు షర్మిల. మహిళలపై 300 శాతం దాడులు పెరిగాయని, బంగారు తెలంగాణ బారుల, బీరుల తెలంగాణ అయ్యిందని విమర్శించారు. కొత్త కొలువులు ఉండవని, ఉన్న వాటికి భరోసా లేదని అన్నారు షర్మిల. గత ఏడేళ్ళల్లో ఏడు వేల మంది ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు.
రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయని, సుమారు ఏడాదిపాటు పాదయాత్ర ఉంటుందని, రోజుకి 12 నుంచి 15కి.మీ పాదయాత్ర ఉంటుందని ఆమె చెప్పారు. కేసీఆర్కు భాజపా, కాంగ్రెస్ ఎలా అమ్ముడుపోయాయో పాదయాత్రలో చెబుతానన్నారు. ప్రతి పల్లెకు వెళతాం.. ప్రతి గడపా తడతాం.. అని అన్నారు షర్మిల.