Urination : మూత్రపిండాల ఆరోగ్యం మూత్ర విసర్జనతో చెప్పవచ్చా?…
ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి మూత్రం పసుపు తెలుపు కలగలిపిన రంగులో ఉంటుంది. కొన్ని రకాల ఆహార పదార్థాలను తిన్నప్పుడు, ద్రవాలను తాగినప్పుడు మూత్రం రంగు మారుతుంది.
Urination : మనిషి ఆరోగ్యం కిడ్నీల పనితీరుపై ఆధారపడి ఉంటుంది. వాటికి ఏ మాత్రం సమస్య వచ్చినా శరీరానికే ముప్పు తతెత్తుతుంది. ముఖ్యంగా శరీరానికి పోషకాలు అందించి విషతుల్యాలను బయటకు పంపేసే అవయవాలు కిడ్నీలు. రక్తాన్ని శుద్ధి చేసి.. శరీరానికి అవసరం లేని వ్యర్థాలను మూత్రం రూపంలో బయటకు పంపుతాయి. మనం రోజూ అనేక రకాల ఆహారాలను తింటుంటాం. అనేక ద్రవాలను తాగుతుంటాం. దీంతో ఆ పదార్థాలన్నీ శరీరంలో కలసిపోతాయి. ఈ క్రమంలో ద్రవాలుగా మారిన వాటిని మూత్ర పిండాలు వడబోస్తాయి. వాటిల్లోని పోషకాలను శరీరంలోకి పంపిస్తాయి. వ్యర్థాలను మూత్రంగా బయటకు పంపుతాయి.
మనిషికి నిత్యం 2 నుంచి 3 లీటర్ల నీరు అవసరం. కచ్చింతగా అంత మొత్తంలో నీటిని తాగితేనే దాన్ని శరీరం పూర్తిగా ఉపయోగించుకుని జీవక్రియలన్నీ సక్రమంగా జరుగుతాయి. కనీస మోతాదుకు తక్కువగా నీరు తాగితే అనేక రకాల అనారోగ్యాలు కలుగుతాయి. ప్రధానంగా కిడ్నీలు ఇబ్బందులకు గురయ్యేందుకు అవకాశం ఉంటుంది. అయితే రోజుకి కనీసం 2 లీటర్ల నీటిని తాగే ఆరోగ్యవంతమైన వ్యక్తులు 4 నుంచి 7 సార్లు మూత్ర విసర్జన చేయాలి. 4 సార్ల కన్నా తక్కువగా మాత్రం మూత్ర విసర్జన చేయకూడదు. లేదంటే అనారోగ్య సమస్యలు వస్తాయి. అలాగని ఎక్కువ సార్లు మూత్ర విసర్జన చేసినా ఎలాంటి హానీ కలగదు. అయితే కొందరు రోజూ ఎక్కువ సార్లు మూత్ర విసర్జన చేస్తారు. కొందరు తక్కువగా మూత్రం పోస్తారు. మరి ఆరోగ్యవంతమైన వ్యక్తులు రోజుకు ఎన్నిసార్లు మూత్ర విసర్జన చేయాలన్నదానిపై కొందరు నిపుణులు కొన్ని అభిప్రాయాలను వ్యక్త పరిచారు.
ఆల్కహాల్, కాఫీ, టీ వంటివి తాగినప్పుడు, మూత్రాశయం ఇన్ఫెక్షన్లు ఉన్నవారు, డయాబెటిస్ ఉన్నవారు, నీటిని అధికంగా తాగేవారు సహజంగానే 7 సార్ల కన్నా ఎక్కువగానే మూత్ర విసర్జన చేస్తారు. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు, ఆయా సమస్యలు ఉన్నవారు 7 సార్ల కన్నా ఎక్కువగా మూత్ర విసర్జన చేస్తే దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు. అది సహజమే. అయితే కేవలం 2 లీటర్ల నీటిని మాత్రమే తాగుతున్నా.. అంటే తగిన మోతాదులోనే తాగుతున్నా.. రోజుకు 11 సార్ల కన్నా ఎక్కువగా మూత్ర విసర్జన చేస్తే అప్పుడు ఆ పరిస్థితిని అనారోగ్య స్థితిగా అనుమానించాలి. వెంటనే వైద్యున్ని సంప్రదించి పరీక్షలు చేయించుకుని అనారోగ్య సమస్యలు ఉన్నట్లు తేలితే వెంటనే చికిత్స తీసుకోవాలి.
ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి మూత్రం పసుపు తెలుపు కలగలిపిన రంగులో ఉంటుంది. కొన్ని రకాల ఆహార పదార్థాలను తిన్నప్పుడు, ద్రవాలను తాగినప్పుడు మూత్రం రంగు మారుతుంది. అంతే కాదు కొన్ని సందర్భాల్లో వాసన కూడా వస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తిన్నప్పుడు మూత్రం రంగు ఎలా ఉన్నా, ఎలాంటి వాసన వచ్చినా భయం లేదు. అదే జంక్ ఫుడ్ వంటివి తిన్నప్పుడు మూత్రం రంగు మారడం, దుర్వాసన రావడం వస్తే అనుమానించాలి. మూత్రం తీయని వాసన వస్తుంటే వారికి డయాబెటిస్ ఉందని తెలుసుకోవాలి. సాధారణంగా ఆరోగ్యవంతమైన వ్యక్తి మూత్ర విసర్జన వ్యవధి 7 సెకండ్ల వరకు ఉంటుంది. అయితే ఇది వయస్సు పెరిగే కొద్దీ తగ్గుతూ వస్తుంది. వయస్సు మీద పడిన కొద్దీ మూత్ర విసర్జనకు తరచూ వెళ్లాల్సి వస్తుంటుంది. మూత్రాన్ని ఎక్కువ సేపు ఆపుకోకూడదు. దీని వల్ల మూత్రాశయ ఇన్ఫెక్షన్లు, కిడ్నీ స్టోన్స్ వస్తాయి.
తగినన్ని నీళ్లు తాగడం మూత్రపిండాల ఆరోగ్యంలో ఎంతో ముఖ్య పాత్ర పోషిస్తుంది. రోజుకు కనీసం 8-10 గ్లాసుల మంచి నీరు తాగాలి. అదేవిధంగా పండ్ల రసాలను కూడా ఎక్కువగా తీసుకోవాలి. మూత్రపిండాల్లోని సోడియం, యూరియా లాంటి విష పదార్థాలు మూత్రం ద్వారా బయటకు వెళతాయి. తద్వారా కిడ్నీలో రాళ్లు ఏర్పడడం వంటి దీర్ఘకాలిక సమస్యల నుంచి రక్షణ పొందవచ్చు. అధిక బరువు ఉండడమంటే శరీరంలో కొలెస్ట్రాల్ లాంటి టాక్సిన్లు చేరినట్లే. ఇవి శరీరంలోని అవయవాలపై తీవ్ర ఒత్తిడిని కలిగిస్తాయి. కాబట్టి వ్యాయామాన్ని జీవనశైలిలో భాగం చేసుకుని కొవ్వును కరిగించుకోండి. లేకపోతే ఊబకాయం, రక్తపోటు సమస్యలు వచ్చే ప్రమాదముంది. ఇవి క్రమంగా మూత్రపిండాల పనితీరుపై ప్రభావం చూపుతాయి.