పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలనకు కేబినెట్ ఆమోదం
puducherry పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలనకు బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం కూలిన తర్వాత కొత్తగా ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో రాష్ట్రపతి పాలన విధించాలంటూ ఇన్చార్జి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసిన విషయం తెలిసిందే.
కేంద్ర కేబినెట్ ఆమోదంతో పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. కాగా, ఈ వారం మొదట్లో అసెంబ్లీలో జరిగిన బల పరీక్షలో నారాయణస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తన మెజార్టీని నిరూపించుకోలేకపోయింది. అసెంబ్లీలో బల నిరూపణ కంటే ముందే సీఎం, ఆయన మంత్రివర్గం రాజీనామా చేశారు.
అటు ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వ ఏర్పాటుపై ఆసక్తి చూపకపోవడంతో రాష్ట్రపతి పాలన అనివార్యమైంది. పుదుచ్చేరి ఏప్రిల్-మే నెలల్లో మళ్లీ ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.