Chirag Paswan : బీహార్ పాలిటిక్స్ లో బిగ్ ట్విస్ట్..అబ్బాయికి బాబాయ్ మరో షాక్
బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
Chirag Paswan బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. యువ రాజకీయనేత చిరాగ్ పాశ్వాన్కు గట్టిఎదురుదెబ్బ తగిలింది. చిరాగ్ పాశ్వాన్ బాబాయ్,ఎంపీ పశుపతి పరాస్ నేతృత్వంలో ఎల్జేపీలో తిరుగుబాటు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలు ఎల్జేపీ లోక్సభా పక్ష నేతగా ఎల్జేపీ నేతగా పరాస్ను ఎన్నుకున్నట్లు ఆదివారం లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను స్వయంగా కలసి తెలియజేయడం..పరాస్ను ఎల్జేపీ పక్షనేతగా గుర్తిస్తూ సోమవారం లోక్సభ సెక్రటేరియట్ నోటిఫికేషన్ను విడుదల చేసిన విషయం తెలిసిందే.
ఇక,చిరాగ్ పాశ్వాన్ ను లోక్జనశక్తి పార్టీ అధ్యక్ష పదవి నుంచి కూడా తొలగిస్తూ మంగళవారం పరాస్ బృందం సంచలన నిర్ణయం తీసుకుంది. ఎంపీ పశుపతి పరాస్.. ఎల్జేపీ పార్లమెంటరీ నేతగా, పార్లమెంటరీ బోర్డు చైర్మన్గా, జాతీయాధ్యక్షుడిగా ఉంటారని స్పష్టం చేసింది. అదే విధంగా కొత్త అధ్యక్షుడిగా పారస్ బాధ్యతలు చేపట్టేవరకు ఎల్జేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా సూరజ్ భాన్ సింగ్ ఉంటారని పారాస్ గ్రూప్ పేర్కొంది. మరో రెండు మూడు రోజుల్లో పూర్తిస్థాయిలో అధికార మార్పిడి జరిగి పశుపతి కుమార్ పరాస్ చేతికి పార్టీ పగ్గాలు వస్తాయని సమాచారం.
ఇక తనను తొలగిస్తున్నట్లు ప్రకటన వెలువడిన వెంటనే చిరాగ్, పార్టీ సభ్యులతో వర్చువల్ సమావేశం ఏర్పాటు చేశారు. అధిష్టానం ఆదేశాలు బేఖాతరు చేసిన ఎంపీలను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. బుధవారం పత్రికా సమావేశం ఏర్పాటు చేసి అన్ని విషయాలు చర్చిస్తానని తెలిపారు. అదేవిధంగా,చిరాగ్ పాశ్వాన్ ఓ భావోద్వేగ ట్వీట్ కూడా చేశారు. తన బాబాయ్ ఎంపీ పరాశ్ కు మార్చిలో తాను రాసిన ఓ లేఖను కూడా అందులో షేర్ చేశారు. తన తండ్రి,తన కుటుంబం స్థాపించిన పార్టీని కలిపి ఉంచేందుకు చాలా కృషి చేశానని,కానీ తాను విఫలమయ్యానని చిరాగ్ పేర్కొన్నారు. పార్టీ తల్లిలాంటిదని.. తల్లిలాంటి పార్టీని మోసం చేయకూడదన్నారు. ప్రాజాస్వామ్యంలో ప్రజలే అన్నింటికి మించి అని చిరాగ్ తెలిపారు. పార్టీలో తనపై నమ్మకం ఉంచిన వారికి కృతజ్ణతలు తెలిపారు చిరాగ్ పాశ్వాన్.