మాజీ బీజేపీ అధ్యక్షుడు చెప్పాడు : ట్రంప్ కోసం గోడ…గుజరాత్ కాంగ్రెస్ ప్రభుత్వం పనేనంట
గుజరాత్ లో అధికారంలో ఉన్నది ఎవరు అంటే కాంగ్రెస్ అనే చెప్పాలి కాబోలు ఇక నుంచి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అహ్మదాబాద్ పర్యటన సమయంలో ఆయనకు మురికివాడలు కనిపించకుండా ఎత్తైన గోడలు కడుతుందట గుజరాత్ లోని కాంగ్రెస్ సర్కార్. గుజరాత్ లో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పట్ల దుర్మాగంగా వ్యవహరిస్తుందని తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు,మాజీ రాజ్యసభ ఎంపీ ఎల్ గణేశన్ తెలిపారు.
ట్రంప్ కు మురికివాడలు కనిపించకుండా అహ్మదాబాద్ యంత్రాగం గోడ కడుతున్న విషయంపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్న సమయంలో దీనిపై తమిళనాడు బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్ గణేశన్ స్పందించారు. అయితే ఆయన స్పందన బీకామ్ లో ఫిజిక్స్ ఉందని చెప్పినట్లుగా ఉంది.
ట్రంప్ కి మురికివాడలు కన్పించకుండా గుజరాత్ సర్కార్ గోడ కడుతుంది కదా,దీనిపై మీరేమంటారు అని చెన్నైలో గణేశన్ ను మీడియా ప్రతినిధిలు ప్రశ్నించగా…..22ఏళ్ల నుంచి గుజరాత్ లో బీజేపీ అధికారంలో కొనసాగుతున్న విషయం మర్చిపోయిన ఈ బీజేపీ సీనియర్ లీడర్ రిపోర్టకు సమాధానమిస్తూ… అహ్మదాబాద్ లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఆ మాత్రం తెలియకుండా మీరు నన్ను అడుగుతున్నారు అక్కడేదో బీజేపీ ప్రభుత్వం ఉన్నట్లు. మీ ప్రశ్నలకు సమాధానం చెప్పనక్కర్లేదు అంటూ మీడియా ప్రతినిధులపై చిరుకోపం ప్రదర్శించారు.
అయితే అంతటితో ఆగని ఈ బీజేపీ లీడర్…గుజరాత్ లో కాంగ్రెస్ గెలిచింది కాబట్టి అక్కడ పరిస్థితులు చాలా దారుణంగా మారాయని, త్వరలోనే గుజరాత్ లో బీజేపీ అధికారంలోకి వస్తుందని గణేశన్ ధీమా వ్యక్తం చేశారు. 1998నుంచి గుజరాత్ లో బీజేపీనే అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్రమోడీ 2001నుంచి 2014వరకు గుజరాత్ సీఎంగా పనిచేశాడన్న విషయాన్ని కూడా ఈ మాజీ బీజేపీ అధ్యక్షడు మర్చిపోవడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఓ రేంజ్ లో సెటైర్లు వేస్తున్నారు.