Narottam Mishra : అమ్మను అరెస్ట్ చెయ్యాలన్న మూడేళ్ల చిన్నారికి హోంమంత్రి దీపావళి గిఫ్ట్

మా అమ్మ నన్ను కొట్టింది, ఆమెను అరెస్ట్ చేసి జైల్లో పెట్టండి అంటూ.. మూడేళ్ల బుడ్డోడు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసిన ఘటన గుర్తుంది కదూ.

Narottam Mishra : అమ్మను అరెస్ట్ చెయ్యాలన్న మూడేళ్ల చిన్నారికి హోంమంత్రి దీపావళి గిఫ్ట్

Narottam Mishra : మా అమ్మ నన్ను కొట్టింది, ఆమెను అరెస్ట్ చేసి జైల్లో పెట్టండి అంటూ.. మూడేళ్ల బుడ్డోడు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసిన ఘటన గుర్తుంది కదూ. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. మధ్యప్రదేశ్ లో జరిగిందీ ఘటన. ఆ చిన్నారి చేసిన పని నవ్వులు పూయిస్తోంది.

కాగా, ఈ ఘటనపై మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా సైతం స్పందించారు. పిల్లాడు చేసిన పనికి ఫిదా అయిన మంత్రి.. దీపావళి కానుకగా.. బాలుడికి సైకిల్ ఇచ్చారు. అంతేకాదు, అతడితో వీడియో కాల్ కూడా మాట్లాడారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

మధ్యప్రదేశ్ రాష్ట్రం బుర్హాన్‌పుర్ జిల్లా దేఢ్ తలాయి గ్రామానికి చెందిన మూడేళ్ల బాలుడు సద్దామ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి వాళ్ల అమ్మపై ఫిర్యాదు చేశాడు. ఇంతకీ ఆ బుడ్డోడికి వాళ్ల అమ్మ మీద కోపమెందుకొచ్చిందంటే.. ముద్దుగా చెంపపై కొట్టిందట. అంతేకాదు, తలస్నానం చేయించాక కాటుక పెడుతుందట. కాటుక పెట్టుకోవటం ఇష్టం లేదని చెప్పినా వినడం లేదట. అంతటితో ఆగకుండా వాళ్ల నాన్న తన కోసం తెచ్చిన చాక్లెట్లన్నీ దొంతనం చేస్తోందట.

రోజూలాగే మూడు రోజుల క్రితం వాళ్ల అమ్మ ముద్దుగా చెంపపై కొట్టింది. అప్పటికే తల్లిపై ఆగ్రహంతో ఉన్న సద్దామ్ కు కోపం కట్టలు తెచ్చుకుంది. పోలీస్ స్టేషన్ కు వెళదాం వస్తావా? రావా? అంటూ తండ్రి దగ్గరకు వెళ్లి గొడవపెట్టాడు. దీంతో తండ్రి సైతం బుడ్డోడిని తీసుకొని స్టేషన్ కు వెళ్లి విషయం చెప్పాడు. అక్కడ సబ్‌-ఇన్‌స్పెక్టర్‌ ప్రియాంకా నాయక్‌కు సద్దామ్‌ తన గోడు వెళ్లబోసుకున్నాడు. ఫిర్యాదు తీసుకోవాల్సిందేనని పట్టుబట్టాడు. చిన్నారి తీరుతో ఒక్కసారి గట్టిగా నవ్వేసిన ఆమె.. సద్దామ్‌ నుంచి ఫిర్యాదు స్వీకరించారు. మా అమ్మను జైల్లో పెట్టండి అంటూ చిన్నారి ముద్దుముద్దుగా అడుగుతుండటంతో.. ప్రియాంకా నాయక్ బుడ్డోడి ఫిర్యాదును కాగితంపై రాసింది. ఇదంతా వీడియో తీశారు. ఇప్పుడా వీడియో వైరల్ అయ్యింది. ముద్దు ముద్దు మాటలతో బుడ్డోడు చేసిన పని నవ్వులు పూయిస్తోంది.