Indian Students Ukraine : ‘మాకు ఏమైనా భారత ప్రభుత్వం, ఇండియన్ ఎంబసీదే బాధ్యత.. ఇదే మా చివరి వీడియో’
తమలో ఎవరికి ఏమి జరిగినా.. ఆపరేషన్ గంగ అతిపెద్ద వైఫల్యం అవుతుందన్నారు. ఇదే తమ చివరి వీడియో అని విద్యార్థులు వెల్లడించారు. తమ ప్రాణాలను ఫణంగా పెట్టి ముందుకు సాగుతున్నామని చెప్పారు.
Indian students Ukraine : సుమిలో భారత ప్రభుత్వం, ఎంబసీపై ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతీయ విద్యార్థుల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో జాతీయ జెండాలను ప్రదర్శిస్తూ పదుల సంఖ్యలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. రష్యా తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించి.. మానవతా సాయం కింద పౌరులను తరలించేందుకు అవకాశం కల్పించిందని చెప్పినా.. ఇంకా బాంబు దాడులు జరుగుతున్నాయని విద్యార్థులు చెబుతున్నారు.
బాంబులు, షెల్లింగ్, కాల్పులు ఇంకా వినిపిస్తున్నాయని పేర్కొన్నారు. ఇప్పటికే చాలా రోజుల నుంచి వేచి చూస్తున్నామని తెలిపారు. ఇక వేచిచూసేది లేదు.. తాము అందరం సరిహద్దుల్లోకి బయలుదేరుతున్నామని పేర్కొన్నారు. తమకు ఏమైనా అది భారత ప్రభుత్వం, ఇండియన్ ఎంబసీదే బాధ్యతేనని తేల్చి చెప్పారు. తమలో ఎవరికి ఏమి జరిగినా.. ఆపరేషన్ గంగ అతిపెద్ద వైఫల్యం అవుతుందన్నారు. ఇదే తమ చివరి వీడియో అని విద్యార్థులు వెల్లడించారు. తమ ప్రాణాలను ఫణంగా పెట్టి ముందుకు సాగుతున్నామని చెప్పారు. తమ కోసం ప్రార్థించమని, ఇదే తమ చివరి సందేశం.. అంటూ భారత పౌరులు ప్రకటన చేశారు.
యుక్రెయిన్ లోని సుమి కాల్పుల మోతతో దద్దరిల్లుతోంది. సుమిలో నరకం చూస్తున్న భారతీయ విద్యార్థులు ప్రాణాలకు తెగించి సరిహద్దులకు బయలుదేరుతున్నారు. రెండు నగరాల్లో కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ సుమిలో మాత్రం లేదు. అయితే ఇక అక్కడ ఉండలేకపోతున్న భారతీయ విద్యార్థులు మన జెండాలతో సరిహద్దులకు బయలుదేరుతున్నారు. భారతీయ జెండాలతో ఉంటే రష్యన్లు కాల్పులు జరపరన్న నమ్మకంతో వాటితో బయలుదేరుతున్నారు. సుమిలో వేయిమందికి పైగా భారతీయ విద్యార్థులున్నారు. ప్రస్తుతం వారంతా అక్కడ నరకం చూస్తున్నారు. ఇంకొన్నాళ్లు అక్కడే ఉంటే తిండికి కూడా లేక చనిపోతామంటున్నారు.
యుక్రెయిన్ రాజధాని కీవ్పై మళ్లీ ఫోకస్ పెంచింది రష్యా. కీవ్తో పాటు రాజధాని సమీప ప్రాంతాల్లో నాన్స్టాప్గా దాడులు చేస్తోంది. కీవ్ మిలటరీ ఆస్పత్రిపై బాంబుల వర్షం కురిపించింది రష్యా. అటు యుక్రెయిన్ నగరాలపై వైమానికి దాడులతో విరుచుకుపడుతోంది రష్యా. రోజుకు సగటున 25కు పైగా మిస్సైల్ దాడులతో యుక్రెయిన్ మొత్తాన్ని షేక్ చేస్తోంది. యుక్రెయిన్లో ఇప్పటి వరకు 500లకు పైగా మిస్సైల్స్ను రష్యా ప్రయోగించింది.
Russia – Ukraine War: ‘సుమీలో విద్యార్థుల గురించి ఆందోళనగా ఉంది’
ఐక్యరాజ్యసమితితోపాటు పలు దేశాలు దాడులు ఆపాలని కోరుతున్నప్పటికీ రష్యా మాత్రం వెనక్కి తగ్గడం లేదు. రష్యా-యుక్రెయిన్ల మధ్య కొనసాగుతున్న భీకరమైన యుద్ధం 10వ రోజుకు చేరినా పరిస్థితుల్లో ఏ మార్పు కనిపించడంలేదు. ఎక్కడచూసినా విధ్వంసమే కనిపిస్తోంది. శవాల దిబ్బలు, ధ్వంసమైన భవనాలే దర్శనమిస్తున్నాయి. ప్రాణాలను కాపాడుకునేందుకు ప్రజలు వేరే ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు. ఇరు దేశాల మధ్య రెండు సార్లు చర్చలు జరిగినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
ఈ క్రమంలో యుక్రెయిన్పై రష్యా దాడులను ప్రపంచంలోని చాలా దేశాలు ఖండిస్తున్నప్పటికీ పుతిన్.. ఏమాత్రం వెనక్కితగ్గడం లేదు. షెల్స్, బాంబులతో యుక్రెయిన్ నగరాలపై విరుచుకుపడుతున్నారు. ఈ దాడులతో చాలా నగరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇరు దేశాల సైనికులతో పాటు వందలాది మంది ప్రజలు సైతం దాడుల్లో ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. దీంతోపాటు చాలామంది గాయాల పాలయ్యారు. చికిత్స అందక అనేక మంది ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారంటే పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.