Siddaramaiah : ఆలయంలోకి రావాలంటే నన్ను షర్టు విప్పమన్నారు: సీఎం సిద్దరామయ్య
నన్ను షర్టు విప్పి లోపలికి రమ్మన్నారు..ఇది అమానవీయం కదా..అంటూ భారత్ లో సనాతన ధర్మం గురించి వివాదం కొనసాగుతున్న క్రమంలో సీఎం సిద్ధ రామయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

cm siddaramaiah
CM Siddaramaiah : సనాతన ధర్మపై తమిళనాడు మంత్రి, సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి (udhayanidhi stalin) వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెను దుమారం రేపుతున్న వేళ కర్ణాటక సీఎం (Karnataka CM) సిద్ధరామయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో సనాతన ధర్మం (Sanatan Dharma) వ్యాఖ్యలు కాక పుట్టిస్తున్న వేళ సీఎం సిద్ధరామయ్య తనను ఓ దేవాలయంలోకి రాకుండా అడ్డుకున్నారు అంటూ కేరళ (Kerala)లోని హిందూ దేవాలయంలో తనకు ఎదురైన అనుభవం గురించి చెప్పుకొచ్చారు.
బెంగళూరులోని సంఘసంస్కర్త నారాయణ గురు 169వ జయంతిని పురస్కరించుకుని జరిగిన ఓ కార్యక్రమంలో సిద్ధరామయ్య మాట్లాడుతూ.. ”నేను ఒకసారి కేరళకు వెళ్లినప్పుడు ఓ ఆలయానికి వెళ్లాను. ఆలయంలోకి రావాలంటే నా షర్టు విప్పి రమ్మన్నారు. దానికి నేను నిరాకరించాను. దేవాలయంలోకి వెళ్లకుండానే బయట నుంచి ప్రార్థించి వచ్చేశాను. అక్కడికి వచ్చినవారి అందరిని చొక్కాలు విప్పమనలేదు. కొందరిని మాత్రమే చొక్కాలు తీయమన్నారు. ఇటువంటి చర్యలు అమానవీయమైనవి దేవుడి ముందు అందరం సమానమే’’ అని అన్నారు. కాగా, దక్షిణ భారతదేశంలో కొన్ని దేవాలయాల్లోకి ప్రవేశించే ముందు పురుషుల చొక్కాలు తీసేసి, భుజాలపై అంగవస్త్రంతో ఆలయాల్లోకి ప్రవేశించడం ఆచారంగా వస్తోంది.
తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. సనాతన ధర్మ డెంగీ, మలేరియా లాంటిదని దాన్ని నిర్మూలించాలి అంటూ చేసిన వ్యాఖ్యలు భారత్ లో పెను దుమారాన్ని రేపుతున్నాయి. దేశవ్యాప్తంగా ఆయనపై సనాతనవాదులు విమర్శలు చేస్తుండగా, ప్రగతిశీలవాదులు మద్దతుగా మాట్లాడుతున్నారు.