కేరళ బీజేపీ సీఎం అభ్యర్థిగా మెట్రో మ్యాన్

కేరళ బీజేపీ సీఎం అభ్యర్థిగా మెట్రో మ్యాన్

Kerala elections కేరళలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న సమయంలో బీజేపీ తమ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించింది. దేశంలో అనేక మెట్రో ప్రాజెక్టులకు రూపకల్పన చేసి మెట్రో మ్యాన్ గా పేరుపొందిన ఈ శ్రీధరన్​ ను కేరళ శాససన సభ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది. ఈ మేరకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కే సురేంద్రన్ ప్రకటించారు. ఇతర అభ్యర్థుల జాబితాను త్వరలోనే విడుదల చేస్తామని ఆయన తెలిపారు.

కాగా,రెండు వారాల క్రితం బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించిన శ్రీధరన్..పార్టీ కోరితే శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తానని, అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు తాను సిద్ధమని ప్రకటించిన విషయం తెలిసిందే. అధికారం చేపడితే రాష్ట్రాన్ని అప్పుల ఊబి నుంచి బయటపడేసి, అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు.

ఇక, ఏప్రిల్-6న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ స్థానం నుంచి పోటీ చేసేందుకైనా తాను సిద్దమేనని శ్రీధరన్ ప్రకటించారు. ఈసారి కేరళలో బీజేపీ అధికారంలోకి వస్తుందని తాను బలంగా నమ్ముతున్నట్లు చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తాను డోర్ టూ డోర్ క్యాంపెయిన్ చేయనని శ్రీధరన్ తెలిపారు. ఇళ్లకు,షాపుల వద్దకు ఓట్లు అడిగేందుకు తాను వెళ్లనని,కానీ తన సందేశం ఓటర్లకు చేరుతుందని ఆయన తెలిపారు. అయితే, గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఒక్క సీటు మాత్రమే వచ్చిన విషయం తెలిసిందే.