పానీపూరీని నిషేధించిన అధికారులు..
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ జిల్లా యంత్రాంగం పానీపూరి అమ్మకాలపై నిషేధం విధించింది. పానీపూరీ వ్యాపారులు సరైన జాగ్రత్తలు తీసుకోకుండా పానీపూరీలు అమ్ముతున్నారనీ..దీంతో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాపించే అవకాశముందని భావించిన జిల్లా యంత్రాంగం జిల్లా వ్యాప్తంగా పానీపూరీలపై నిషేధం విధించింది. అంతేకాదు..పలురకాల స్ట్రీట్ ఫుడ్స్ పై కూడా నిషేధం విధించారు. జిల్లా మేజిస్ట్రేట్ డాక్టర్ బ్రహ్మదీయో రామ్ తివారీ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగా ఈ నిర్ణయం తీసుకుంది.
దీంతో పానీపూరి వ్యాపారులు మండిపడుతున్నారు. ఇప్పటికే మూడు నెలల నుంచి వ్యాపారాలు లేక..కుటుంబాలలో అల్లాడిపోతున్నామని ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్న షాపులతో కాస్త ఊరట పొందామని ఈ సమయంలో ఇటువంటినిర్ణయంతో మా పొట్టలు కొడుతున్నారంటూ వాపోతున్నారు.
కాగా పానీపూరీ అమ్మే వ్యాపారులు లాక్డౌన్ నిబంధనలను సరిగా పాటించక పోవడం వల్లే జిల్లా యంత్రాంగం ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతోంది. పానీపూరీ అమ్మకాలు చేస్తున్న సమయంలో చాలా మంది వ్యాపారులు ముఖాలకు మాస్కులు, చేతులకు గ్లౌజులు ధరించడం లేదని అధికారులు తెలిపారు.
కాగా..యూపీలో బుధవారం (జూన్ 17,2020) కొత్తగా 583 పాజిటివ్ కేసులు నమోదైయ్యాయని వైద్య శాఖ అధికారులు తెలిపారు. ఈ రోజునే కరోనా మహమ్మారి సోకి 30 మంది మృతిచెందారు. దీంతో కరోనా మరణాల సంఖ్య 465కి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 15,181 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో పానీ పూరి అమ్మకాల వల్ల మరింతగా ప్రభలే అవకాశముందని కాన్పూరు జిల్లా యంత్రాంగం నిషేధం విధించింది.
Read: రండమ్మా..రండీ..చీర కొంటే ‘కరోనా కిట్ ఫ్రీ’..కరోనా కాలంలో ట్రెండ్లీ బిజినెస్