మన రాష్ట్రాల్లో కాదండీ : డ్వాక్రా మహిళకు ఎంపీ టికెట్

  • Published By: venkaiahnaidu ,Published On : March 18, 2019 / 03:23 PM IST
మన రాష్ట్రాల్లో కాదండీ : డ్వాక్రా మహిళకు ఎంపీ టికెట్

పేదవాళ్ల కోసం పుట్టిన పార్టీ మాది,వారికి రాజకీయాల్లో అవకాశాలు కల్పిస్తాం,మహిళా సాధికారత కోసం కృషి చేస్తాం అంటూ అనేక రాజకీయపార్టీలు వట్టి మాటలు చెబుతూ ఉండటం మనం రోజూ చూస్తూనే ఉంటాం.చేతిలో చిల్లిగవ్వ లేకపోతే ఏ పార్టీకూడా సీటు ఇవ్వని పరిస్థితి.ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులు ఎంత ఖర్చుపెట్టుకోగలరో లెక్కలేసుకుని,ఎవరికైతే ఎక్కువ డబ్బు ఖర్చుపెట్టుకోగలిగే సామర్థ్యం ఉంటుందో అలాంటివారికే అధికశాతం రాజకీయ పార్టీలు సీట్లు కేటాయించడం మనం చూస్తుంటాం. అయితే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఎంత ఖర్చుపెట్టగలరు అని అడిగే పార్టీ కాదు తమది అభ్యర్థి ఎంతమందికి సేవ చేయగలడు అన్నదే తమ సిద్దాంతం అని ఒడిషాకు చెందిన బిజూ జనతాదళ్ పార్టీ(BJD) నిరూపించింది.పేద మహిళకు ఎంపీ సీటు కేటాయించి అందరికీ ఆశ్చర్యం కలిగింది.

20 ఏళ్ల క్రితం తన రాజకీయ జీవితం ప్రారంభించిన ఒడిషాలోని అస్కా లోక్ సభ నియోజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్థిగా సెల్ప్ హెల్ప్ గ్రూప్(స్వయం సహాయక సంఘం)వర్కర్ ప్రమిలా బిసోయ్ ను సోమవారం(మార్చ-18,2019) బీజేడీ చీఫ్,ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ప్రకటించారు. ప్రమిలాను పార్లమెంట్ లో అడుగుపెట్టే క్షణం కోసం తాను ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. రాజకీయాల్లో మహిళా సాధికారతకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు.18 ఏళ్ల క్రితం రాష్ట్రంలోని మహిళలను చైతన్యవంతులు చేయడం కోసం మిషన్ శక్తి ప్రారంభించామని, ఇప్పుడు అది 70 లక్షల మంది మహిళలతో తమ అంచనాలకు మించి ఓ నిశబ్ద విప్లవంగా రూపాంతరం చెందిందని నవీన్ పట్నాయక్ అన్నారు. పరిశుభ్రత,వ్యాక్సినేషన్, అక్ష్యరాస్యత,పర్యావరణ పరిరక్షణ తదితర అంశాల్లో ప్రమిలా తన నాయకత్వ లక్షణాలతో అందరినీ ప్రభావితం చేసిందని,ప్రజల్లో చైతన్యం సృష్టించిందని తెలిపారు. ఎంపీ స్థానాల్లో 33శాతం మహిళలకు కేటాయించనున్నట్లు మార్చి-10,2018న ఓ బహిరంగ సభలో సీఎం నవీన్ పట్నాయక్ ప్రకటించిన విషయం తెలిసిందే.

గంజామ్ జిల్లాకు చెందిన ప్రమిలా  సత సంఖా స్వయం సహాయక సంఘం లీడర్ గా ఉంది. చెర్మారియా ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు మధ్యాహ్నా భోజనం సరఫరా చేస్తుంటుంది.వృత్తి రీత్యా వ్యవసాయదారురాలైన ఆమెకు భర్త భంచనిధి బిసోయ్, ఇద్దరు కొడుకులు దిలీప్, రంజన్, ఇద్దరు కుమార్తెలు రునూ,సుల్తానా లు ఉన్నారు. పెద్ద కొడుకు దిలీప్ టీ అమ్ముతుండగా,చిన్న కొడుకు రంజన్ బైక్ రిపేర్ గ్యారేజ్ లో పనిచేస్తున్నాడు. వీరికి ఉన్న ఎకరా పొలంలోనే వరి,రాగి పండిస్తుంటారు. ప్రమిలా తమ గ్రామంలోని మహిళలందరినీ సాధికారత దిశగా నడిపించడమే కాకుండా పర్యావరణ పరిరక్షణ కోసం కూడా కృషి చేస్తోంది. ప్రకృతి మిత్రా,ప్రకృతి బంధు అవార్డులను అందుకున్న ఆమె ఓ చక్కని కవి కూడా.

ప్రమిలాతో పాటుగా సోమవారం బీజేడీ ప్రకటించిన తొమ్మిదిమంది లోక్ సభ అభ్యర్థుల జాబితాలో మరో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. కొరపుత్ లోక్ సభ స్థానం నుంచి కౌశల్య హికాకా,సుందర్ ఘర్ నుంచి సునితా బిశ్వాల్ పేర్లను ప్రకటించారు. కొరపుత్ సిట్టింగ్ ఎంపీ జినా హికాకా భార్య కౌశల్య హికాకా కాగా,మాజీ ఒడిషా సీఎం హేమానంద బిశ్వాత్ కూతురే సునితా బిశ్వాల్.